భారత్‌తో కయ్యం.. మాల్దీవ్స్‌ అధ్యక్షుడికి మరో ఎదురుదెబ్బ

Byline :  Krishna
Update: 2024-01-14 02:06 GMT

భారత్తో కయ్యానికి దిగిన మాల్దీవ్స్ అధికార పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. మాల్దీవ్స్ మంత్రుల వ్యాఖ్యలతో రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. దీంతో ఆ దేశం భారీ నష్టాన్ని మూటగట్టుకుంటోంది. ఈ క్రమంలో అక్కడి అధికార పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మాలే మేయర్ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ విజయం సాధించింది. భారత్ అనుకూల మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ఆదమ్ అజీమ్.. అధికార పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహమ్మద్ సోలీపై భారీ మెజార్టీతో గెలిపొందారు.

మాల్దీవ్స్ అధ్యక్షుడు మహమ్మద్ మయిజ్జు అధ్యక్షుడు కాకముందు మాలే మేయర్గా పనిచేశారు. ఈ క్రమంలో ఈ ఓటమి ఆ పార్టీకి పెద్ద షాకే. ఇప్పటికే అక్కడి ప్రభుత్వంపై వ్యాపారస్థులు సహా ప్రజలు నిప్పులు చెరుగుతున్నారు. భారత్ చేసిన సాయాన్ని మరచిపోవద్దని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల దేశ సంస్కృతి, ఆర్థిక, భౌగోళిక సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపెడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా ఆహారం, మౌలిక సదుపాయాలు వంటి వాటిలో మాల్దీవులు భారత్ పైనే ఎక్కువగా ఆధారపడుతోంది. అయితే రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బ తినడంతో మాల్దీవ్స్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు చైనా పర్యటకు వెళ్లిన మాల్దీవ్స్ అధ్యక్షుడు.. చైనీయులను మాల్దీవులకు రావాలని ఆహ్వానించడం గమనార్హం.

ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్లో పర్యటించారు. ఈ సందర్భంగా సముద్రం ఒడ్డున కూర్చొని కాసేపు సేద తీరారు. అంతేకాకుండా సముద్రంలో స్నార్కెలింగ్ చేసిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. వీటిపై మాల్దీవుల యూత్ ఎంపవర్మెంట్ డిప్యూటీ మంత్రి మరియం షియునా అనుచిత వ్యాఖ్యలు చేశారు. మోదీని ఇజ్రాయెల్ తోలుబొమ్మ అని పేర్కొంటూ ట్వీట్ చేసింది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. భారత్ కూడా ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఆమె సోషల్ మీడియా అకౌంట్ల నుంచి ఆ పోస్టులను డిలిట్ చేసింది. పోస్టులు డిలిట్ చేసిన.. ఆ వివాదం మాత్రం కొనసాగుతూనే ఉంది.

Tags:    

Similar News