Arvind Kejriwal : ఆరోసారి ఈడీ విచారణకు సీఎం కేజ్రీవాల్‌ డుమ్మా..

Byline :  Krishna
Update: 2024-02-19 05:48 GMT

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఈడీ విచారణకు డుమ్మా కొట్టారు. లిక్కర్ స్కాం కేసులో ఇవాళ విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే విచారణకు హాజరుకావడం లేదని ఈడీకి ఆయన సమాచారమిచ్చారు. ఈ అంశంపై కోర్టులో విచారణ జరుగుతున్న తరుణంలో ఈడీ నోటీసులు ఇవ్వడం చట్టవిరుద్దమని ఆప్ ఆరోపించింది. కోర్టు నిర్ణయం వచ్చేంతవరకు దర్యాప్తు సంస్థ ఆగాల్సిందేనని తెలిపింది

ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా కొట్టడం ఇది ఆరోసారి. గతంలో 5సార్లు నోటీసులు జారీ చేయగా.. ఆయన విచారణకు హాజరుకాలేదు. కేజ్రీవాల్ విచారణకు సహకరించడం లేదని ఇప్పటికే ఈడీ కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో కేజ్రీవాల్ కోర్టు విచారణకు హాజరయ్యారు. ఈ నెల 17న వర్చువల్గా కేజ్రీవాల్ కోర్టు విచారణకు హాజరయ్యారు. తదుపరి విచారణను మార్చి 16కు వాయిదా వేసింది. ఇక మార్చి 16న కేజ్రీవాల్ స్వయంగా కోర్టుకు హాజరుకానున్నారు.

కాగా లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి ఈడీ గతేడాది నవంబర్‌ 2న తొలిసారిగా సీఎం కేజ్రీవాల్‌కు నోటీసులు జారీచేసింది. అయితే ఆయన విచారణకు హాజరుకాలేదు. దీంతో ఈడీ అధికారులు డిసెంబర్‌ 21న రెండోసారి నోటీసులు పంపారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ఉందన్న కారణంతో 10 రోజులపాటు విపాసన మెడిటేషన్‌ క్యాంప్‌నకు వెళ్లారు. ఈ క్రమంలో జనవరి 3న విచారణకు రావాలంటూ ఆప్‌ అధినేతకు మూడోసారి నోటీసులు పంపించింది. అయితే దానికి కూడా సీఎం కేజ్రీవాల్‌ దూరంగా ఉన్నారు. జనవరి 18న 4వ సారి, జనవరి 31న ఐదోసారి నోటీసులు జారీ చేసింది. అయినా కేజ్రీవాల్ విచారణకు హాజరుకాలేదు.

Tags:    

Similar News