మరికొన్ని గంటల్లో ఢిల్లీకి దేశాధినేతలు.. భద్రత కట్టుదిట్టం..

Byline :  Krishna
Update: 2023-09-07 16:49 GMT

జీ20 సమ్మిట్కు ఢిల్లీ సిద్ధమైంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు అగ్రదేశాధినేతలు శుక్రవారం భారతగడ్డపై అడుగుపెట్టనున్నారు. జీ20 కూటమిలోని 20 సభ్యదేశాలు, 11 ఆహ్వాన దేశాలు, యూఎన్, ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకు వంటి అనేక అంతర్జాతీయ సంస్థల అధినేతలు ఈ కీలక సదస్సుకు హాజరవుతారు. ఈ క్రమంలో అతిధులకు ఆతిథ్యం ఇచ్చేందుకు అన్నీ ఏర్పాట్లు చేశారు. అటు భద్రతనూ కట్టుదిట్టం చేశారు. 5వేల సీసీ కెమెరాలతో పాటు కేంద్ర బలగాలు, పోలీసులు బందోబ్తు నిర్వహిస్తున్నారు.

బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ముందుగా భారత్ చేరుకోనున్నారు. ఆయనకు కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్ చౌబే స్వాగతం పలుకుతారు. ఎయిర్ పోర్టు నుంచి ఆయన నేరుగా షంగ్రి-లా హోటల్‌లోకు వెళ్తారు. ఇక అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ సాయంత్రం 7గంటల సమయంలో భారత్ చేరుకుంటారు. ఆయన ఐటీసీ మౌర్యలో బస చేస్తారు. క్లారిడ్జెస్‌లో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌, ఇంపీరియల్‌ హోటల్‌లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్‌ బస చేస్తారు.

జీ20 సమ్మిట్ ఎజెండాలో కీలక అంశాలున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలకు రుణాలను పెంచడం, అంతర్జాతీయ రుణ నిర్వహణను సరళీకరించడం, క్రిప్టో కరెన్సీలపై నియంత్రణ, భౌగోళిక రాజకీయ అనిశ్చితి, గ్రీన్‌ డెవలప్‌మెంట్‌, వాతావరణ మార్పులు, వేగవంతమైన-సుస్థిరాభివృద్ధి, వ్యవసాయం-ఆహార వ్యవస్థ, సాంకేతిక మార్పులు, 21వ శతాబ్దపు బహుపాక్షిక సంస్థలు, మహిళా సాధికారతతో అభివృద్ధి వంటి అంశాలే ఎజెండాగా జీ20 సదస్సు సాగనుంది.

Tags:    

Similar News