దూకుడు మీదున్న బీజేపీ.. అభ్యర్థుల తొలి జాబితా విడుదల

Update: 2023-08-18 02:09 GMT

ఈ ఏడాది చివరిలో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలపై దృష్టిసారించిన బీజేపీ.. అభ్యర్థుల ప్రకటన ప్రక్రియ మొదలుపెట్టింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇంకా నోటిఫికేషన్​ ఇవ్వకముందే తన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసి అందరినీ ఆశ్యర్యంలో ముంచెత్తింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల తొలి జాబితాను గురువారం రిలీజ్​ చేసింది. రెండు రాష్ట్రాల్లో పార్టీ ఎన్నికల సన్నాహాలను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమీక్షించిన ఒక రోజు తర్వాత ఈ ప్రకటన వెలువడింది. ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 స్థానాలు ఉంటే 21 మందితో తొలి జాబితాను గురువారం విడుదల చేసింది. అలాగే మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 సీట్లు ఉండగా తొలి విడతలో 39 పేర్లు ప్రకటించింది. రెండు రాష్ట్రాల్లోనూ ఐదుగురు చొప్పున మహిళలకు టికెట్లు ఇచ్చింది.

ఛత్తీస్‌గఢ్‌లో ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్​ ప్రాతినిధ్యం వహిస్తున్న పటాన్‌ స్థానంలో పార్టీ తరఫున దుర్గ్‌ ఎంపీ విజయ్ బఘేల్​ను పోటీకి పెట్టింది. 2018లో జరిగిన ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో 90 సీట్లకు గానూ కాంగ్రెస్ 68 స్థానాలు విజయం సాధించింది. కేవలం 18 సీట్లు మాత్రమే గెలుపొందింది. ఈ సారి ఎలాగైనా ఛత్తీస్​గఢ్​లో విజయం సాధించాలని బీజేపీ అగ్రనేతలు భావిస్తున్నారు.

ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్​గఢ్​, మిజోరం, తెలంగాణ, రాజస్థాన్​లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఛత్తీస్​గఢ్, రాజస్థాన్​లో కాంగ్రెస్ అధికారంలో ఉండగా.. తెలంగాణను కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్​ఎస్ పాలిస్తోంది. మధ్యప్రదేశ్​ను బీజేపీ పాలిస్తుండగా.. మిజోరం భాగస్వామి పార్టీతో అధికారం పంచుకుంటోంది. ఈ నేపథ్యంలో ఛత్తీస్​గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.

Tags:    

Similar News