ఘోర ప్రమాదం.. వాహనాలు వెళ్తుండగా కూలిన వంతెన

By :  Kiran
Update: 2023-09-24 15:18 GMT

గుజరాత్లో ఘోరం జరిగింది. సురేంద్ర నగర్ జిల్లా వస్తాడి ప్రాంతంలో ఓ పాత వంతెన కూలిపోయింది. ఆ సమయంలో దానిపై ప్రయాణిస్తున్న ఓ డంపర్, మోటర్ బైక్స్తో పాటు పలు వాహనాలు నదిలో పడిపోయాయి. ఈ ఘటనలో 10 మంది గల్లంతయ్యారు.

ప్రమాదం విషయం తెలిసిన వెంటనే స్థానికులు నదిలో పడిపోయిన వారిని రక్షించే ప్రయత్నాలు చేశారు. గల్లంతైన 10 మందిలో ఆరుగురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మరో నలుగురి కోసం గాలింపు కొనసాగుతోంది. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయపడిన వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు.

నేషనల్ హైవే, చురు ప్రాంతాన్ని కలిపే ఈ వంతెనను 40ఏండ్ల క్రితం నిర్మించారు. బ్రిడ్జి పాతదైపోవడంతో దానిపైకి భారీ వాహనాల రాకపోకలను నిషేధించారు. అయినా డంపర్ వంతెన దాటే ప్రయత్నం చేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బ్రిడ్జి పాతది కావడంతో కొత్త బ్రిడ్జి నిర్మాణాన్ని ఇప్పటికే రోడ్లు భవనాల శాఖకు అప్పగించినట్లు కలెక్టర్ ప్రకటించారు.

Tags:    

Similar News