Electricity Charges : కరెంట్ బిల్లులను పెంచేయండి

Byline :  saichand
Update: 2024-01-13 03:41 GMT

విద్యుత్ బిల్లుల వ్యయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కీలక సూచన చేసింది. విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల మొత్తం వ్యయాన్ని విద్యుత్ బిల్లుల రూపంలో రాబట్టుకోవాల్సిందేనని ఆదేశించింది. అందుకు గానూ విద్యుత్ చార్జీలను ఎప్పటికప్పుడు పెంచాలని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా విద్యుత్ (సవరణ) నిబంధనలు–2024 గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక ఈ నోటిఫికేషన్ అధారంగా ఈఆర్సీ కీలక నిర్ణయం తీసుకోనుంది. విద్యుత్ చార్జీలను ఏ మేరకు పెంచాలి అనే దానిపై ఈఆర్సీ ప్రణాళిక రూపొందించనుంది.

విద్యుత్ (సవరణ) నిబంధనలు–2024 గెజిట్ నోటిఫికేషన్ సూచనలు

విద్యుదుత్పత్తి కంపెనీలకు గడువులోగా బిల్లులు చెల్లించనప్పుడు డిస్కంలపై విధించే లేట్ పేమెంట్ సర్ చార్జీని నియోగదారుల నుంచి మూడేళ్లలో మూడు సమ వాయిదాల్లో వసూలు చేసుకోవాలి. విద్యుత్ (సవరణ) నిబంధనలు–2024 గెజిట్ నోటిఫికేషన్ అమల్లోకి రాకముందే లేట్ పేమెంట్ సర్ చార్జీలకు సంబంధించిన బిల్లులను రాబోయే ఏడేళ్లలో ఏడు సమ వాయిదాల్లో వినియోగదారుల నుంచి వసూలు చేయాలి.

ఏదైనా విద్యుదుత్పత్తి కంపెనీలు, ఎనర్జీ స్టోరేజీ సిస్టంలు ప్రత్యేక ట్రాన్స్ మిషన్ లైన్లను ఏర్పాటు చేసుకోవడానికి ఇకపై ప్రత్యేకంగా లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. కాని వాటి సామర్థ్యం అంతర్రాష్ట్ర ట్రాన్స్ మిషన్ వ్యవస్థ పరిధిలో ఉంటే 25 మెగావాట్లకు లోబడి ఉండాలి. అలాగే గెజిట్ నోటిఫికేషన్లోని మార్గదర్శకాలను అనుసరించాల్సి ఉంటుంది.

లాంగ్టర్మ్ యాక్సెస్ కలిగిన వినియోగదారులకు విధించే అడిషన్ సర్ చార్జీ స్వల్పకాలిక ఓపెన్ యాక్సెస్ వినియోగదారులపై విధించే అదనపు సర్ చార్జితో సమానంగా ఉండకూడదు. స్వల్ప కాలిక ఓపెన్ యాక్సెస్ వినియోగదారుల వర్తించే అదనపు సర్ చార్జి 110 శాతానికి మించి ఉండరాదని కేంద్రం .విద్యుత్ (సవరణ) నిబంధనలు–2024 గెజిట్ నోటిఫికేషన్ పేర్కొంది. ఓపెన్ యాక్సెస్ వినియోగదారులపై మేపే అదనపు సర్ చార్జీ.. డిస్కంలు కొనుగోలు చేసే విద్యుత్ ఫిక్స్డ్ ధరలకు మించకుండా ఉండాలి.

Tags:    

Similar News