చుట్టాల ఇంటికి వచ్చిన దళిత యువకుడిని కొట్టి, చెప్పులు నాకించారు

Update: 2023-07-09 05:12 GMT

మధ్యప్రదేశ్ లో ఓ గిరిజనుడిపై మూత్ర విసర్జన ఘటన మరువక ముందే ఉత్తరప్రదేశ్ లో ఓ దళితుడిపై దాడి జరిగింది. అతడిని తీవ్రంగా కొట్టి చెప్పులు నాకించారు. ఇతరులకు సాయం చేసినందుకు అతడు ఈ ఘోరమైన శిక్షను అనుభవించాడు. వివరాల్లోకి వెళ్తే.. యూపీలోని సోన్ భద్రా జిల్లాలోని ఓ గ్రామంలో తేజ్‌బాలీ సింగ్ పటేల్ అనే వ్యక్తి లైన్ మేన్ గా పని చేస్తున్నాడు. చుట్టుపక్కల గ్రామాల ప్రజల ఇళ్లల్లో విద్యుత్ కు సంబంధించిన సమస్యలు ఉంటే ఆయన డబ్బులు(Money) తీసుకొని పరిష్కరిస్తుంటాడు. అయితే ఇందుకోసం అతడు అధిక డబ్బు వసూలు చేస్తాడని స్థానికులు చెబుతున్నారు.

ఈ క్రమంలోనే అతడు లైన్ మేన్ గా పని చేస్తున్న గ్రామానికి.. రాజేంద్ర అనే దళిత యువకుడు తన బంధువులు ఇంటి వచ్చాడు. బంధువు ఇంట్లో కరెంట్ సమస్యలు ఉంటే రాజేంద్ర బాగు చేశాడు. ఈ విషయం తెలిసిన ఇరుగుపొరుగు వారు.. తమ ఇంట్లో కరెంట్ కనెక్షన్ కు సంబంధించి సమస్యలు ఉంటే బాగు చేయించుకోవడం ప్రారంభించారు. అతడి పనితనం పక్క ఊరి వాళ్లకు కూడా తెలియడంతో తేజ్ బాలీ సింగ్‌కు డబ్బులు ఇచ్చి పనులు చేయించుకునే బదులు.. రాజేంద్ర సాయం కోరారు. వారు కోరినట్టే రాజేంద్ర తనకు వచ్చిన పనితో.. అందర్నీ ఆకర్షించాడు.


ఈ విషయం తెలుసుకున్న తేజ్ బాలీ సింగ్.. రాజేంద్ర వద్దకు వెళ్లి తీవ్రంగా తిట్టాడు. తనకొచ్చే డబ్బులను, తన ఉపాధిని దెబ్బ తీశావంటూ అతడిని ఇష్టమొచ్చినట్లు కొట్టాడు. అంతటితో ఆగకుండా తన కాళ్లకున్న చెప్పులను రాజేంద్రతో నాకించాడు. కాగా ఈ ఘటననంతా ఓ వ్యక్తి తన సెల్ ఫోన్ లో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఈ వ్యవహారం బయటి ప్రపంచానికి తెలిసింది. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇక ఈ ఘటనపై పలు రాజకీయ పార్టీలు, దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి.

Tags:    

Similar News