లిఫ్ట్ అడిగిన అనామకుడికి కారునే ఇచ్చేశాడు.. మత్తు దిగాక..

Update: 2023-06-13 03:55 GMT

మద్యం ఎక్కువై.. ఏం చేస్తున్నాడో తెలియక అపరిచిత వ్యక్తికి.. సొంత కారును అప్పగించి, మెట్రో ఎక్కి ఇంటికెళ్లాడో ఉద్యోగి. తాగిన మత్తు దిగిన తరువాత అసలు విషయం గుర్తుకు వచ్చి తల పట్టుకున్నాడు. తన కారు, ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్.. రూ.18,000 నగదును పోగొట్టుకున్నట్టు గుర్తించి.. లబోదిబో మంటూ పోలీస్ స్టేషన్ కు పరిగెత్తాడు. శుక్రవారం రాత్రి ఢిల్లీలో ఈ విచిత్రమైన ఘటన జరిగింది.

ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్-IIలో నివసిస్తున్న అమిత్ ప్రకాశ్(30) గురుగ్రామ్ గోల్ఫ్ కోర్స్ రోడ్‌లోని ఒక సంస్థలో ఉద్యోగి. శుక్రవారం రాత్రి గుర్ గావ్ లోని తన ఆఫీస్ నుంచి బైటికొచ్చి కారులో మద్యం తాగాడు. అతనికది సరిపోలేదు. ఇంకాస్త తాగాలనుకుని గోల్ఫ్ కోర్స్ రోడ్డు సమీపంలోని మద్యం దుకాణానికి వెళ్లి రూ. 2వేలు పెట్టి ఓ వైన్ బాటిల్ కొన్నాడు. ఆ సమయంలో అతను రెండువేలకు బదులు రూ.20వేలు ఇచ్చాడు. దీనికి ఆ షాపు ఓనర్ రూ.18వేలు తిరిగిచ్చాడు. ఆ డబ్బులు తీసుకుని రోడ్డు పక్కన కారులో కూర్చుని మద్యం తాగుతున్నాడు.

ఇంతలో ఓ వ్యక్తి కారు దగ్గరికి వచ్చి తనకూ మందు పోయమని అడిగాడు. తనకు సుభాష్ చౌక్ దాకా లిఫ్ట్ ఇవ్వమని కోరాడు. దీనికి అమిత్ ఒప్పుకుని కారెక్కించుకున్నాడు. కాసేపటికి మద్యం మత్తులో పూర్తిగా మునిగాక లిఫ్ట్ అడిగిన వ్యక్తి.. అమిత్‌ను తన కారు దిగాలని చెప్పాడు. అమిత్ కూడా అలాగే కారు దిగి..అపరిచితుడికి కారు అప్పగించాడు. ఆ తర్వాత అమిత్ మెట్రో ఎక్కి ఇంటికి వెళ్లిపోయాడు. ఘటన జరిగిన ఒక రోజు తర్వాత తాను ఏం చేశానన్న విషయం కాస్త గుర్తించి.. హర్యానా నగరంలోని సెక్టార్ 65 పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాడు. పోలీసులకు ఆ రోజు జరిగిందో.. తనకు గుర్తున్న విషయాలను చెప్పాడు. కానీ ఆ అపరిచితుడి గురించి ఎటువంటి వివరణ ఇవ్వలేకపోయాడు, దీని కారణంగా పోలీసులు అతన్ని గుర్తించడానికి సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. 

Tags:    

Similar News