అయోధ్య రాముని నెల ఆదాయం ఎంతో తెలుసా!

By :  Vinitha
Update: 2024-02-25 03:59 GMT

ఎన్నోదశాబ్దాల అయోధ్య రామమందిరం కల నెరవేరి ఒక నెల పూర్తయ్యింది. జనవరి 22న అంగరంగ వైభంగా బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగగా ఫిబ్రవరి 21తో నెల పూర్తయ్యింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి రామ్ లల్లాను దర్శించుకుంటున్నారు. బాలరాముని దర్శించుకొని పునీతులవుతున్నారు. రామ్ లల్లాకి కానుకలు, విరాళాలను కూడా భారీగా సమర్పించుకుంటున్నారు. నెల పూర్తవ్వడంతో మొదటి నెల రోజుల ఆదాయాన్ని అయోధ్య రామాలయం ట్రస్ట్ ప్రకటించింది. మొదటి నెలలో రూ.25 కోట్ల విలువైన విరాళాలు అందాయని ట్రస్ట్ వెల్లడించింది. స్వామివారికి 25 కిలోల బంగారం, వెండి ఆభరణాలతో పాటు చెక్కులు, డీడీలు, నగదు రూపంలో విరాళాలు వచ్చాయని రామాలయ ట్రస్ట్ అధికారి ప్రకాశ్ గుప్తా వెల్లడించారు.

ఆన్ లైన్ ద్వారా ట్రస్ట్ బ్యాంకు ఖాతాలలోకి నేరుగా వచచిన ఆదాయం సంగతులు తమకు తెలియదన్నారు. ఆలయంలో వినియోగించని వెండి, బంగారంతో చేసిన పాత్రలు, సామగ్రిని రామ్‌లల్లాకు విరాళంగా ఇస్తున్నారన్నారు. అయితే, భక్తుల భక్తిని దృష్టిలో ఉంచుకుని వాటిని స్వీకరిస్తున్నామని తెలిపారు. విరాళాలకు సంబంధించిన రసీదులను జారీ చేయడానికి 12 కంప్యూటరైజ్డ్ కౌంటర్లు సిద్దం చేసినట్లు చెప్పారు. ట్రస్ట్ ద్వారా ఆలయ ప్రాంగణంలో అదనపు విరాళాల హుండీలను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విరాళాలను లెక్కించేందుకు త్వరలోనే పెద్ద గదిని కూడా నిర్మించనున్నట్టు చెప్పుకొచ్చారు. రామనవమి వేడుకల సమయంలో విరాళాలు పెరుగుతాయని రామమందిర్ ట్రస్ట్ అంచనా వేస్తోంది. ఈ టైంలో అయోధ్యను దాదాపు 50 లక్షల మంది రానున్నట్లు సమాచారం. కాగా ఈ నెలలో దాదాపు 60 లక్షల మందికి పైగా భక్తులు ఆలయాన్ని సందర్శించారని తెలిపారు. రామ్ లల్లాకు వచ్చిన బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులను కరిగించి నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వానికి అప్పగించనున్నారు. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు రామాలయ ట్రస్ట్ ట్రస్టీ అనిల్ మిశ్రా తెలిపారు. 

Tags:    

Similar News