సునామీ సైరన్తో వణికిన గోవా వాసులు.. ఆ తర్వాత...

Byline :  Krishna
Update: 2023-09-07 16:02 GMT

గోవాలో సునామీ కలకలం రేగింది. సునామీ సైరన్ మోగడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆ తర్వాత సునామీ రాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన బుధవారం రాత్రి జరిగింది. గోవాలోని పోర్వోరిమ్ ప్రాంతంలో ఓ కొండపై EWDSను ఏర్పాటు చేశారు. ఇది సునామీ రావడానికి ముందు విపత్తును పసిగట్టి ప్రజలను అలర్ట్ చేస్తుంది. అయితే బుధవారం రాత్రి ఈ సైరన్ మోగడంతో ప్రజలు భయాందోళన చెందారు.

సుమారు 20 నిమిషాల పాటు ఈ సైరన్ మోగింది. అంతసేపు సైరన్ మోగడంతో అది పొరపాటున మోగినట్లు ప్రజలు గ్రహించారు. రాత్రి భోజనం చేసిన తర్వాత సైరన్‌ మోగింది. దీంతో మేమంతా ఎంతో భయాందోళనకు గురయ్యాం. చాలాసేపు అది మోగుతూనే ఉంది. కానీ సముద్రం నుంచి అలజడి లేదు. సైరన్‌ తప్పుడు హెచ్చరిక జారీ చేస్తోందని గ్రహించాం అని స్థానికులు తెలిపారు.

సాంకేతిక సమస్య వల్లే సైరన్ మోగిందని ఉత్తర గోవా జిల్లా కలెక్టర్ మము హేగే చెప్పారు. సైరన్ మోగడంపై వాతావరణ విభాగంతో మాట్లాడామని.. అయితే సునామీకి సంబంధించి ఎలాంటి హెచ్చరికలు లేవని వారు చెప్పినట్టు కలెక్టర్ వివరించారు. సైరన్ మోగడానికి గల కారణాలను గుర్తించాలని రాష్ట్ర జలవనరుల శాఖను కోరినట్టు తెలిపారు.

Tags:    

Similar News