Mumbai: భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు సజీవదహనం

Update: 2023-10-06 04:13 GMT

మహారాష్ట్రలోని ముంబయి నగరంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గోరేగావ్‌లోని ఏడు అంతస్తుల భవనంలో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో జరిగిన ఈ అగ్నిప్రమాదంలో ఏడుగురు సజీవదహనమయ్యారు. మరో 40 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నికీలల్లో చిక్కుకున్నవారిని రక్షించేందుకు సహాయక చర్యలుచేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అగ్ని ప్రమాదంలో పలు ద్విచక్ర వాహనాలు, కార్లు కూడా దగ్ధమయ్యాయి.

అగ్నిమాపక సిబ్బంది భవనంలో మంటలను ఆర్పుతున్నారు. ఏడు అంతస్తుల భవనంలోని పార్కింగ్ ప్రాంతంలో మంటలు చెలరేగినట్లు అధికారులు చెప్పారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు వెంటనే మంటలను ఆర్పే చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. గాయపడినవారిలో 12 మంది పురుషులు, 28 మంది మహిళలు ఉన్నారని అధికారులు చెప్పారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయంటున్నారు అగ్నిమాపక సిబ్బంది. పార్కింగ్ ఏరియాలో పడి ఉన్న గుడ్డకు మంటలు అంటుకోవడంతో మంటలు ఆ ప్రాంతమంతా వ్యాపించాయి. అగ్నిప్రమాదానికి ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడానికి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News