School Admissions : ఆరేళ్లు నిండితేనే ఒకటో తరగతి అడ్మిషన్.. కేంద్రం కీలక ఆదేశాలు

చిన్నారుల చదువుల విషయంలో కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లలకు ఆరేళ్లు నిండితేనే వారికి ఒకటో తరగతిలో అడ్మిషన్ ఇవ్వాలని ఆదేశించింది. ఈ తరుణంలో నిబంధనలను రూపొందించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 కింద, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 కింద ఒకటో తరగతిలో చేరే పిల్లలకు ఆరేళ్లు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది. నూతన విద్యావిధానం, విద్యా హక్కు చట్టంలోని ప్రొవిజన్స్ ప్రకారంగా నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది.
2024-25 విద్యా సంవత్సరం నుంచి ఒకటో తరగతిలో అడ్మిషన్స్ తీసుకునే పిల్లలకు 6 ఏళ్లు ఉండాల్సిందేనని కేంద్రం తెలిపింది. అయితే 6 ఏళ్లు నిండినవారికే ఒకటో తరగతిలో అడ్మిషన్స్ ఇవ్వాలనే అంశంపై తెలంగాణ సర్కార్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఈ విధానంపై విద్యాశాఖ అధికారులతో ఓ కమిటీని వేసినట్లు తెలుస్తోంది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ సిలబస్లో ఇప్పటికే ఆరేళ్లు నిండిన వారికే ఒకటో తరగతిలో అడ్మిషన్స్ ఇవ్వాలనే రూల్ ఎప్పటి నుంచో అమలవుతోంది. ఇప్పుడు ఆ నింబంధనను అన్ని స్కూళ్లలో వర్తింపజేయాలని కేంద్రం అధికారులకు ఆదేశాలిచ్చింది.