Ujjain: ఉజ్జయిని అత్యాచార కేసు: చేసిన తప్పుకు ఆటోడ్రైవర్‌ పశ్చాత్తాపం!!

Update: 2023-10-02 04:49 GMT

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో 12 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచార ఘటన యావత్తు దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సభ్య సమాజం తలదించుకునే రీతిలో.. బాధితురాలు వీధుల్లో నగ్నంగా తిరుగుతూ సాయం కోసం అర్ధించినా ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. మానవత్వం మంటగలిసిన ఈ ఘటనకి సంబంధించిన కేసులో ప్రధాన నిందితుణ్ని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. అనుమానితుడిగా పేర్కొంటూ.. రాకేశ్ మాలవీయ అనే ఓ ఆటో డ్రైవర్‌ను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి ఆటోలో రక్తపు మరకలు కనిపించడంతో నిందితుడిగా భావించి అరెస్ట్ చేశారు.

కానీ, విచారణలో ఆ ఆటో డ్రైవర్‌ చెప్పిన పలు విషయాలతో.. అతడు నిందితుడి కాదని తెలిసింది. విచారణలో.. ఆ రోజు దీనస్థితిలో.. నగ్నంగా ఉన్న బాధితురాలికి తన ఒంటిపై ఉన్న దుస్తులు ఇచ్చినట్టు చెప్పాడా ఆటోడ్రైవర్. కానీ, ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లకుండా నడిరోడ్డుపై వదిలిపెట్టి తాను తప్పుచేశానని పశ్చాత్తాపం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ‘ బాధితురాలి పరిస్థితి చూసి వెంటనే నా ఒంటిపై ఉన్న ఖాకీ చొక్కా ఇచ్చాను. తన ఇంటికి వెళ్లేందుకు బాలిక సాయం చేయమంది.. కానీ, నేను అలా చేయలేదు.. నాకెందుకులే అని అనుకున్నాను. కానీ ఇప్పుడు చాలా చింతిస్తున్నాను. నేను కూడా అయోమయంలో పడ్డాను. నేను మొదటిసారి ఇటువంటి పరిస్థితిలో ఎదుర్కొన్నాను.. ఎవరికి చెప్పాలో అర్థం కాలేదు’ అని ఆవేదన వ్యక్తం చేశాడు.

అయితే చిన్నారుల లైంగిక వేధింపుల నిరోధక చట్టాల ప్రకారం సాయానికి నిరాకరించడం కూడా నేరమేనని పోలీసులు చెబుతున్నారు. ఆ సమయంలో బాధితురాలు జీవన్‌ ఖేరీ ప్రాంతంలో ఆటో ఎక్కినట్లు సీసీటీవీలో నమోదైంది. అయితే ఆటోడ్రైవర్ మాలవీయను అనుమానితుడిగా భావించి తొలుత పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. విచారణలో అతని చెప్పిన విషయాలతో జరిగిన దారుణంలో అతని ప్రమేయం లేనట్లు భావిస్తున్నారు.

Tags:    

Similar News