పార్లమెంట్ ను కుదిపేస్తున్న మణిపూర్ అంశం

Update: 2023-07-24 07:22 GMT

పార్లమెంటును మణిపూర్ అంశం గడగడలాడిస్తోంది. దీనిమీద చర్చ జరగాలని సభ్యలు గందరగోళం చేస్తున్నారు. దీంతో ఉభయసభల్లో కార్యకలాపాలు జరగడం లేదు. ఈరోజు కూడా ఉభయసభలను వాయిదా వేశారు.మణిపూర్ అంశం సద్దుమణగడం లేదు. మూడురోజులైనా ఇంకా ఆ అంశం మీదనే పార్లమెంటు సభలు దద్ధరిల్లుతున్నాయి. దాని చర్చ చేయాల్సిందే అంటూ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. దీని మీద ప్రధాని ప్రకటన చేయాల్సిందేనని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈరోజు సభలు ప్రారంభం నుంచే విపక్ష పార్టీలు ప్లకార్డులతో దర్శనమిచ్చాయి. ఇండియా ఫర్ మణిపూర్, మణిపూర్ మీద ప్రధాని ప్రకటన చేయాలి అంటూ నిరసనలు చేశారు. మణిపూర్‌లో పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష కూటమి INDIA ఎంపీలు కూడా గాంధీ విగ్రహం వద్ద గుమిగూడారు.

మరోవైపు రూల్ 176 కింద చర్చ జరపాలని 11 నోటీసులు, రూల్‌ 267 కింద చర్చ జరపాలని 27 నోటీసులు అందాయని రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ వెల్లడించారు. అలాగే పశ్చిమబెంగాల్‌లో పంచాయతీ ఎన్నికల్లో చెలరేగిన హింస మీద కూడా చర్చించాలంటూ బీజెపీ ఎంపీలు నోటీసులు ఇచ్చారు. అనంతరం ఎగువ సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. దీనిపై చర్చకు తాము సిద్ధమేనని కేంద్రం ప్రకటించినప్పటికీ.. చర్చకు ముందే ప్రధాని ప్రకటన చేయాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి.


Tags:    

Similar News