patient on bike: బైక్‌పై పేషెంట్‌తో నేరుగా ఎమర్జెన్సీ వార్డుకు.. వీడియో వైరల్

Byline :  Veerendra Prasad
Update: 2024-02-11 16:32 GMT

‘త్రీ ఇడియట్స్‌’ సినిమాలో అస్వస్థతకు గురైన తన స్నేహితుడి తండ్రిని.. హీరో అమీర్ ఖాన్ తన బైక్‌పై ఎక్కించుకుని సరాసరి ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకెళ్తాడు. రీల్ లైఫ్‌లో జరిగిన ఈ సీన్ ఇప్పుడు రియల్ లైఫ్‌లోనూ చోటు చేసుకుంది. తీవ్ర అస్వస్థతకు గురైన తన తాతను ఓ వ్యక్తి బైక్‌పై ఎక్కించుకుని ఆసుపత్రికి ఎమర్జెన్సీ వార్డు లోపలికి తీసుకొచ్చాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సత్నాలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. శనివారం అర్ధరాత్రి నీరజ్ గుప్తా అనే వ్యక్తి తాత అస్వస్థతకు గురయ్యాడు.

దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా నీరజ్.. మరో వ్యక్తి సహాయంతో తాతను బైక్‌పై కూర్చోబెట్టి సత్నాలోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చాడు. అక్కడితో ఆగకుండా నేరుగా ఎమర్జెన్సీ వార్డులోకి బైక్‌ను నడిపించాడు. వెనుక కూర్చొన్న మరో వ్యక్తి, అక్కడి సిబ్బంది కలిసి అచేతనంగా వున్న ఆ వృద్ధుడిని బైక్ నుంచి కిందకు దించి బెడ్‌పై పెట్టి వెంటనే చికిత్స ప్రారంభించారు. అనంతరం బైక్‌ను రివర్స్‌ తీసుకుని బయటకు వెళ్లిన గుప్తా.. పార్క్‌ చేసి మళ్లీ వచ్చాడు. ఈ వ్యవహారంపై ఆస్పత్రి వైద్యులు అతడిని మందలించినట్లు సమాచారం. అయితే ఎమర్జెన్సీ వార్డులోకి బైక్ రావడంతో అక్కడున్న రోగులు, డాక్టర్లు, ఇతర సిబ్బంది కంగారు పడ్డారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.




Tags:    

Similar News