Nitish Kumar: బీజేపీతో పొత్తు.. బిహార్‌లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం

Byline :  Veerendra Prasad
Update: 2024-01-28 12:04 GMT

 జేడీయూ అధినేత నితీశ్‌ కుమార్‌ మరోసారి బిహార్​ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో రాష్ట్ర గవర్నర్‌ రాజేంద్ర ప్రమాణం చేయించారు. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ నేతృత్వంలోని ఆర్​జేడీతో బంధాన్ని తెంచుకుని బీజేపీతో కలిసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అంతకుముందు బిహార్‌లో ఎన్‌డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని రాష్ట్ర గవర్నర్‌ రాజేంద్రను జేడీయూ అధినేత నితీశ్‌ కుమార్‌ కోరారు. ఈ మేరకు తన పార్టీ ఎమ్మెల్యేల మద్దతు లేఖను ఆయనకు అందజేశారు. దీంతో గవర్నర్‌ కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు వారిని ఆహ్వానించారు. నితీష్ కొత్త ప్రభుత్వంలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. బీహార్ బీజేపీ చీఫ్ సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీజేపీ జాతీయధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర నేతలు హాజరయ్యారు.

గతకొద్దిరోజులుగా బిహార్​లో రాజకీయాలు శరవేగంగా మారాయి. జేడీయూ అధినేత నీతీశ్‌కుమార్‌ తిరిగి ఎన్​డీఏ గూటికి చేరే అవకాశాలున్నట్లు తెగ వార్తలు వచ్చాయి. ఇప్పడదే జరిగింది. నీతీశ్ ఇలా కూటములు మార్చడం ఇది తొలిసారి కాదు. నీతీశ్‌ తిరిగి బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ గూటికి చేరనుండటం కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన భాగస్వామిగా ఉన్న ఇండియా కూటమికి పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఎన్​డీఏలోకి వెళ్లాలన్న నిర్ణయం ఏ రకంగా చూసినా జేడీయూకు ప్రయోజనకరమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Tags:    

Similar News