లంచంగా రూ.5వేలు.. పట్టుకుంటారని కరెన్సీ నోట్లు మింగేశాడు (వీడియో)

Update: 2023-07-25 06:49 GMT

లంచం తీసుకుంటూ రెవెన్యూ శాఖకు చెందిన ఓ ఉద్యోగి ఊహించని పనిచేశాడు. అధికారులకు అడ్డంగా దొరికిపోవడంతో ఆ సొమ్మును గుటుక్కుమనిపించాడు. హాస్పిటల్ కు తీసుకెళ్లిన పోలీసులు మింగేసిన కరెన్సీ నోట్లను కక్కించారు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది.

మధ్యప్రదేశ్‌లోని కట్నీకి చెందిన గజేంద్ర సింగ్‌ రెవెన్యూ డిపార్ట్ మెంట్లో ప‌ట్వారీగా పనిచేస్తున్నాడు. ఓ పని చేసేందుకుగానూ అతని వద్దకు వచ్చిన ఓ రైతును రూ.5 వేల లంచం అడిగాడు. దాంతో ఆ వ్యక్తి లోకాయుక్తకు కంప్లైంట్ చేశాడు. ఫిర్యాదుపై స్పందించిన అధికారులు గజేంద్ర సింగ్ లంచం తీసుకునేప్పుడు పట్టుకునేలా స్కెచ్ వేశారు. ప్లాన్ లో భాగంగా గజేంద్ర సింగ్‌కు చెందిన ప్రైవేటు ఆఫీసులో సదరు వ్యక్తి నుంచి రూ.5వేలు తీసుకుంటుండగా.. లోకాయుక్త అధికారులు పోలీసులతో ఎంటరయ్యారు.

ఊహించని పరిణామంతో షాకైన రెవెన్యూ అధికారి లంచంగా తీసుకున్న డబ్బులు ఏం చేయాలో తెలియక ఆందోళన చెందాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారులకు దొరికిపోకూడదన్న ఉద్దేశంతో ఒక్కసారిగా కరెన్సీ నోట్లను మింగేశాడు. అది చూసి అవాక్కైన అధికారులు వెంటనే అప్రమత్తమైన గజేంద్ర సింగ్‌ను హాస్పిటల్కు తరలించారు. అక్కడ అతను మింగిన కరెన్సీ నోట్లను కక్కించే ప్రయత్నం చేశారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News