సీఎం భార్యకో, కోడలికో అలా జరిగితే అన్న.. బీజేపీ కార్యకర్త అరెస్ట్

Update: 2023-07-28 15:04 GMT

‘‘ముఖ్యమంత్రి భార్యకో, కోడలికో అలా జరిగితే మీరు ఊరుకుంటారా?’’ అని సీఎంను విమర్శించిన కేసులో ఓ బీజేపీ మహిళా కార్యకర్తను కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. టాయిలెట్లో కొందరు విద్యార్థినులు కొన్ని దృశ్యాలను వీడియో తీసిన కేసుపై ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో ఈ చర్య తీసుకున్నారు. ఇటీవల ఉడిపిలోని ఓ ప్రైవేటు కాలేజీ టాయిలెట్‌లో మైనారిటీ వర్గానికి చెందిన ముగ్గురు విద్యార్థినులు వీడియో రికార్డు చేసిన సంగతి బయటపడింది. ఓ యువతి మరుగుదొడ్డిలో మొబైల్‌ ఫోన్‌ గమనించి ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేయడంతో విషయం బయటికి వచ్చింది. వీడియో తీసిన విద్యార్థునులు ఆమెపై కక్షతో ఆ ఆగడానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేసి వీడియోలు తీసిన విద్యార్థులను సస్పెండ్ చేశారు. వారు తాము రికార్డు చేసిన వీడియోలను ఫోన్ నుంచి తొలగించారు.

ఈ వివాదానికి మతం రంగు పులుముకుంది. వీడియో ఘటనపై సోషల్ మీడియాలో వాదవివాదాలు తీవ్రంగా సాగాయి. బీజేపీ ప్రతిదాన్ని రాజకీయం చేస్తోందని, కాలేజీ ఉదంతానికి కూడా మతం రంగు పులుముతోందని కాంగ్రెస్‌ నేతలు మండిపడ్డారు. శకుంతల అనే బీజేపీ కార్యకర్తలకు ఆ విమర్శలు బదులిస్తూ సీఎం సిద్దరామయ్య కుటుంబాన్ని ప్రస్తావించారు. ‘‘సీఎం భార్యకు, కోడలికి అలాంటి పరిస్థితి ఎదురైతే ఎలా స్పందిస్తారు?’’ అని ప్రశ్నించారు. దీనిపై కాంగ్రెస్ కార్యకర్తలు హై గ్రౌండ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శకుంతలను అరెస్ట్ చేశారు. కాసేపు విచారించి విడుదల చేశారు. కాలేజీలో జరిగింది పిల్లల గొడవ అని దానిపై రాజకీయం చేయడం పరికాదని మంత్రి పరమేశ్వర అన్నారు.

Bengaluru Police, BJP activist Shakuntala , CM Siddaramaiah family, Udupi girls college video case, minority students case

Tags:    

Similar News