నన్ను మాట్లాడనివ్వలేదుగా...మీకు ఇలాగే స్వాగతం చెబుతా

Update: 2023-07-27 05:57 GMT

తన ప్రసంగాన్ని తీసేస్తారా అయితే పోండి నేనూ మిమ్మల్ని కలవడానికి రాను, మీకు స్వాగతం చెప్పను అంటూ ఏకంగా ప్రధాని మీద తన అలకను ప్రదర్శించారు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ లో చెప్పారు కూడా.

ఈరోజు ప్రధాని మోడీ రాజస్థాన్ లో పర్యటిస్తున్నారు. ఇక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. దాంతో పాటూ సీకర్ లో బహిరంగ సభలో కూడా ప్రసంగించనున్నారు. అందులోనే రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ది కూడా మూడు నిమిషాల ప్రసంగం ఉంది. కానీ ఏవో కారణాల వలన దాన్ని తీసేశారు. దాంతో అశోక్ కు కోపం వచ్చింది. అందుకే తాను ప్రధానికి స్వాగతం చెప్పను అంటూ మొండిపట్టు పట్టారు. ట్విట్టర్ లోనే సాదరంగా ఆహ్వానం పలుకుతా అంటూ వ్యంగ్యంగా పోస్ట్ పెట్టారు. అంతేకాదు నా ప్రసంగంలో చెప్పాలనుకున్న డిమాండ్లను కూడా ట్విట్టర్ లోనే మీ ముందుంచుతున్నా అని వాటిని కూడా రాసుకొచ్చారు. ఆరు నెలల్లో ఏడోసారి మా రాష్ట్రానికి వస్తున్న మీరు ఈ సారైనా మా డిమాండ్లను నెరవేరుస్తారని ఆశిస్తున్నా అంటూ ప్రధానికి ఫుల్ కౌంటర్లు వేశారు అశోక్ గెహ్లాట్.

అసలేమైందంటే....మణిపూర్ లో మహిళలకు జరిగిన అవమానం గురించి మాట్లాడుతూ ప్రధాని మోడీ రాజస్థాన్ ప్రస్తావన తీసుకువచ్చారు. అది తీవ్ర దుమారం రేపింది. దీని మీద అశోక్ గెహ్లాట్ కూడా తీవ్రంగా స్పందించారు. మోడీ వ్యాఖ్యలను ఖండించారు. దాని తర్వాత ఇదిగో ఇలా సొంత రాష్ట్రంలో జరిగే బహిరంగ సభలో సీఎం ప్రసంగాన్ని తొలగించారు. కానీ ప్రసంగాన్ని కాన్సిల్ చేయడం మీద ప్రధాని కార్యాలయం నుంచి వేరేగా స్పందన వచ్చింది. ప్రోటోకాల్ ప్రకారం ప్రధాని కార్యక్రమానికి ఆహ్వానం, ప్రసంగం అన్నీ పెట్టాం కానీ మీరు కార్యక్రమానికి రాలేరని సీఎం కార్యాలయం నుంచి సమాచారం వచ్చిందని అందుకే కాన్సిల్ చేశామని చెప్పారు. అన్ని కార్యక్రమాలకు మిమ్మల్ని సాదరంగా స్వాగతిస్తున్నాం...అభివృద్ధి పనుల శిలాఫకాల మీదనా మీ పేరును ఉంచాం అని పీఎంవో ట్విట్టర్ లో సమాధానం ఇచ్చింది.

Tags:    

Similar News