సోనియా, రాహుల్ గాంధీకి షాక్.. కోట్ల విలువైన ఆస్తులు సీజ్

By :  Kiran
Update: 2023-11-21 15:04 GMT

గాంధీ కుటుంబానికి గట్టి షాక్ తగిలింది. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది. మనీలాండరింగ్‌ కేసులో రూ.751.90కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేంది. అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌తోపాటు దాన్ని నిర్వహిస్తున్న యంగ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆస్తులు స్వాధీనం చేసుకుంది.

అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌కు సంబంధించి ఢిల్లీ, ముంబై, లక్నో నగరాల్లో రూ.661.69 కోట్ల ఆస్తులను కలిగి ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వెల్లడించింది. దీంతో పాటు ఏజేఎల్‌లో ఈక్విటీ షేర్ల రూపంలో యంగ్‌ ఇండియన్‌ రూ.90.21కోట్లు కలిగి ఉందని చెప్పింది. మరోవైపు నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికకు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో సోనియా, రాహుల్‌ గాంధీలతో పాటు ప్రస్తుత కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్‌ నేత పవన్‌ కుమార్‌ బన్సల్‌లను ఇదివరకే విచారించిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ వారి స్టేట్‌మెంట్లు రికార్డు చేసింది.

మరోవైపు నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికకు అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ ప్రచురణకర్తగా ఉంది. అసోసియేటెడ్ జర్నల్స్కు యాజమాన్య సంస్థ అయిన యంగ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కు సోనియా, రాహుల్‌ సహా కొందరు కాంగ్రెస్‌ నేతలు ప్రమోటర్లుగా ఉన్నారు. అయితే యంగ్‌ ఇండియాలో ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. కాంగ్రెస్‌కు ఏజేఎల్‌ బకాయి పడ్డ రూ.90.25 కోట్లను వసూలు చేసుకునే హక్కును కేవలం రూ.50లక్షలు చెల్లించడం ద్వారా సొంతం చేసుకోవాలని సోనియా, రాహుల్‌ తదితరులు కుట్ర పన్నినట్లు బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి 2013లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Tags:    

Similar News