Assembly election 2023 కొనసాగుతున్న పోలింగ్.. ఉదయం 11 గంటల వరకు పోలైన ఓట్లు ఎన్నంటే..

Byline :  Kiran
Update: 2023-11-17 06:32 GMT

మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ శుక్రవారం ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 స్థానాలకు నేడు ఒకే విడతలో ఓటింగ్‌ జరుగుతుండగా.. ఛత్తీస్‌గఢ్‌లో మిగిలిన 70 నియోజకవర్గాలకు రెండో విడతలో పోలింగ్‌ కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు జనం ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల క్యూ కట్టారు. ఉదయం 11 గంటల వరకు మధ్యప్రదేశ్‌లో 27.62 శాతం, ఛత్తీస్‌గఢ్‌లో 19.65 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది.

మధ్యప్రదేశ్, ఛత్తీస్ఘడ్ రాష్ట్రాల్లో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, ఆయన సతీమణి సాధనా సింగ్‌, ఇద్దరు కుమారులు సెహోర్‌లో ఓటు వేశారు. అంతకుముందు చౌహాన్ స్థానిక ఆలయంలో పూజలు చేశారు.

కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం కమల్ నాథ్‌ ఛింద్వాఢాలో ఓటు వేశారు. ఆయన కుమారుడు, ఎంపీ నకుల్‌ నాథ్‌, కోడలితో కలిసి శిఖర్‌పూర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా గ్వాలియర్లో ఓటువేశారు. ఇండోర్‌-1లో బీజేపీ అభ్యర్థి కైలాశ్ విజయ్‌వర్గియా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

నర్సింగ్‌పూర్‌లో కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ ఓటు వేశారు. మరో కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్‌ తికమ్‌గఢ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మధ్యప్రదేశ్ మంత్రులు నరోత్తమ్‌ మిశ్రా, యశోధరా రాజే సింధియా, రాజ్యవర్ధన్‌ సింగ్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ కుమారుడు జైవర్ధన్‌ సింగ్‌ తదితరులు పోలింగ్ ప్రారంభమైన తొలి గంటల్లో ఓటు వేశారు.




Tags:    

Similar News