Sidhu Moosewala’s Parents : అమ్మ అనే పిలుపు కోసం... మరో బిడ్డకు జన్మనివ్వనున్న సిద్ధూ మూసేవాలా తల్లి

Byline :  Veerendra Prasad
Update: 2024-02-27 10:20 GMT

దివంగత ప్రముఖ పంజాబీ గాయకుడు, కాంగ్రెస్‌ నేత సిద్ధూ మూసేవాలా(Sidhu Moosewala) తల్లిదండ్రులు.. మరోసారి అమ్మనాన్న అని పిలిపించుకోబోతున్నారు. త్వరలోనే వారి కుటుంబంలోకి మరో చిన్నారిని ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. ఆయన తల్లి చరణ్‌ కౌర్‌ త్వరలోనే మరో బిడ్డకు జన్మనివ్వనున్నారని పలు జాతీయ మీడియా కథనాలు ద్వారా తెలుస్తోంది.

రెండేళ్ల క్రితం మే 29, 2022న సిద్ధూ మూసేవాలా దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. మాన్సా జిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్తుండగా.. మార్గమధ్యంలో దుండగులు అడ్డగించి తుపాకీతో కాల్చి చంపారు. అప్పట్లో ఆ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే, తన తల్లిదండ్రులకు సిద్ధూ ఒక్కడే సంతానం. కన్నబిడ్డను కోల్పోయిన వారు వృద్ధాప్యంలో తోడు కోసం మరో బిడ్డను కనాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఐవీఎఫ్‌ ద్వారా ఇటీవల చరణ్‌ కౌర్‌ గర్భం దాల్చినట్లు ఆమె సోదరుడు తెలిపారు. మార్చిలో ఆమె బిడ్డకు జన్మనివ్వనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కౌర్‌ వయసు 58 ఏళ్లు కాగా.. సిద్ధూ తండ్రి బాల్‌కౌర్‌ సింగ్‌ వయసు 60ఏళ్లు.

ఇక సిద్ధూ మూసేవాలా విషయానికొస్తే.. అతని అసలు పేరు శుభ్‌దీప్ సింగ్ సిద్ధూ. జూన్ 17, 1993న మాన్సా జిల్లాలోని మూసే వాలా గ్రామంలో జన్మించాడు. అతడి పాటలకు లక్షల సంఖ్యలో అభిమానులున్నారు. సోషల్ మీడియాలో అతనికి మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉన్నారు. 2021 డిసెంబరులో కాంగ్రెస్‌లో చేరిన సిద్ధూ.. 2022లో జరిగిన పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మాన్సా నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన పాడిన ‘బంబిహ బోలే’, ‘47’ పాట అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. ‘తేరీ మేరీ జోడీ’, మోసా జఠ్‌.. వంటి చిత్రాల్లోనూ నటించారు. త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో సిద్ధూ తండ్రి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News