మూడేళ్ల క్రితం సమాధి సిద్ధం.. ఇప్పుడు పెద్ద కర్మ.. బతికుండగానే పిండం పెట్టుకున్న పెద్దాయన

Update: 2023-06-17 02:41 GMT

ఆయన పేరు జఠాశంకర్. పెళ్లైంది. పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం వయసు ఆరు పదులు దాటింది. ఆరోగ్యంగానే ఉన్నాడు. అయితే కొంతకాలంగా ఆయనను ఓ సందేహం వేధిస్తోంది. దాని గురించి బాగా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం ఆయన చేసిన పని చర్చనీయాంశంగా మారింది.

ఉత్తర్ ప్రదేశ్ ఉన్నావ్ జిల్లాలోని కివానా గ్రామానికి చెందిన జఠాశంకర్ మూడు పెళ్లిళ్లు చేసుకుని ఎనిమిది మంది పిల్లల్ని కన్నాడు. వారిలో ఐదుగురు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. వయసు మీద పడుతుండటంతో జఠాశంకర్ కు ఓ అనుమానం వచ్చింది. తాను చనిపోయాక తన బిడ్డలు కర్మకాండలు సరిగా నిర్వహిస్తారో లేదోనన్న సందేహం వెంటాడింది. దీంతో మూడేళ్ల క్రితం ఆయన ఓ నిర్ణయం తీసుకున్నాడు. తాను బతుకుండగానే పొలంలో సమాధి సిద్ధం చేసుకున్నాడు. ఇది అప్పట్లో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

తాజాగా జఠాశంకర్ కు మరో డౌట్ వచ్చింది. తను చనిపోయాక నిర్వహించాల్సిన పెద్దకర్మ తన బిడ్డలు సక్రమంగా నిర్వహిస్తారో లేదోనన్న ఆలోచనతో మరో నిర్ణయం తీసుకున్నాడు. అనుకున్నదే తడవుగా గురువారం రోజున బంధువులు, గ్రామస్థులను పిలిచి తనకు తాను పిండం పెట్టుకునే కార్యక్రమాలు జోర్దార్ గా నిర్వహించుకున్నాడు. జఠాశంకర్ పెద్దకర్మకు దాదాపు 300 మంది హాజరుకాగా.. వారికి చక్కటి విందు భోజనం ఏర్పాటు చేశాడు. మరణానికి ముందే ఇలాంటి కార్యక్రమం చేయడం ఆచారాల్లో భాగం కాకపోయినా ఎవరిపై నమ్మకం పెట్టుకోకుండా తానే తన పెద్ద కర్మ నిర్వహించుకున్నాడని చెప్పాడు జఠాశంకర్.

Tags:    

Similar News