ప్రపంచంలోని చాలా దేశాలు.. మహిళా ఉద్యోగులకు నెలసరి సమయంలో సెలవులిచ్చే ప్రతిపాదనపై చర్చలు జరుపుతున్నాయి. ఈ ప్రతిపాదనను కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి స్మృతి ఇరానీ వ్యతిరేకించారు. రుతుక్రమం అనేది మహిళకు వైకల్యం కాదని, మహిళ జీవితంలో జరిగే సహజ ప్రక్రియ అని చెప్పారు. ఈ సెలవుల వల్ల పని ప్రదేశాల్లో వివక్షకు దారితీయొచ్చని స్మృతి ఇరానీ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు రాజ్యసభలో ఆర్జేడీ ఎంపీ మనోజ్ కుమార్ ఝా అడిగిన ప్రశ్నకు ఇరానీ సమాధానం ఇచ్చారు. నెలసరి సమయంలో పాటించాల్సిన శుభ్రతపై కేంద్రం ఏదైనా విధానానికి రూపకల్పన చేస్తుందా? అని ఎంపీ ప్రశ్నించగా.. దీనికి సమాధానమిచ్చిన ఇరానీ.. ‘నెలసరి పట్ల ప్రత్యేక దృక్పథం ఉన్నందుకు.. మహిళలకు సమాన అవకాశాలు నిరాకరించిన సమస్యలను మనం ప్రతిపాదించకూడద’ని అమె చెప్పుకొచ్చారు.
10 నుంచి 19ఏళ్ల అమ్మాయిల్లో పలు కార్యక్రమాల ద్వారా నెలసరి శుభ్రతపై అవగాహన కల్పింస్తున్నామని స్మృతి ఇరానీ చెప్పారు. ఇప్పటికే అమల్లో ఉన్న ప్రమోషన్ ఆఫ్ మెన్ స్ట్రువల్ హైజీన్ మేనేజ్మెంట్ (ఎంహెచ్ఎం) స్కీమ్ గురించి ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారు. రుతుస్రావం అనేది స్త్రీలలో జరిగే ఓ శారీరక ప్రక్రియ అని, కొద్ది మంది మహిళల్లో పాత్రమే డిస్మెనోరియా లాంటి సమస్యలతో బాధపడుతుంటారని అన్నారు. ఇలాంటి సమస్యలను చాలావరకు మందులతో నయం చేసుకోవచ్చని చెప్పారు. దీనిపై పార్లమెంట్ లో సోమవారం ఒక నివేదికను ప్రవేశపెట్టారు. దీన్ని ఆరోగ్యశాఖ సమీక్షించాల్సి ఉంది.