Sonia Gandhi : లోక్ సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా సోనియా..?

Byline :  Kiran
Update: 2024-02-12 14:08 GMT

కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ లోక్ సభ ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరో రెండు నెలల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనకూడదని భావిస్తున్న సోనియాను కాంగ్రెస్ హైకమాండ్ రాజ్యసభకు పంపాలని భావిస్తున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే సోనియా గాంధీ నియోజకవర్గమైన రాయ్ బరేలీ నుంచి ఈ సారి ప్రియాంక గాంధీని బరిలో దింపుతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ వార్తలు నిజమైతే ప్రియాంకకు ఇవే తొలి ఎన్నికలు కానున్నాయి. దశాబ్దాలుగా సోనియా రాయ్ బరేలీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవం మూటగట్టుకుంది. రాహుల్ గాంధీ సైతం ఎన్నో ఏండ్లుగా పోటీ చేస్తున్న యూపీలోని అమేథీ నియోజకవర్గం నుంచి ఓటమి పాలయ్యారు. అయితే సోనియా మాత్రం తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు.

సోనియాను రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పంపుతారన్న ఊహాగానాల నేపథ్యంలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ప్రస్తుతం రాజస్థాన్ నుంచి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఆయన పదవీకాలం ఏప్రిల్ 3తో ముగియనుంది. వయసు, ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడంగానీ, పెద్దల సభకు వెళ్లడం గానీ జరిగే అవకాశంలేదు. ఈ క్రమంలో ఆ స్థానం నుంచి సోనియాగాంధీని రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశముంది. 

Tags:    

Similar News