Electoral bonds: ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధం.. సుప్రీం కోర్టు
ఎలక్టోరల్ బాండ్ల చెల్లుబాటుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ బాండ్లు రాజ్యాంగ విరుద్ధం అని తేల్చి చెప్పింది. ఆర్టికల్ 19(1)(ఏ)తో పాటు సమాచార హక్కు చట్టానికి ఇవి విఘాతం కల్గిస్తున్నాయని స్పష్టం చేసింది.
ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా ఈ తీర్పునిచ్చింది. ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ ప్రాథమిక హక్కుల ఉల్లంఘనగా పేర్కొంది. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడం క్విడ్ ప్రోకోకు దారి తీస్తుందని తెలిపింది.
చీఫ్ జస్టీస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. బ్లాక్ మనీ నిర్మూలనకు ఎలక్టోరల్ బాండ్లు ఒక్కటే మార్గం కాదని, నల్లధనాన్ని అరికట్టేందుకు ప్రత్యామ్నాయ మార్గాలున్నాయని వెల్లడించింది. విరాళాలు ఇచ్చిన వారి పేర్లు రహస్యంగా ఉంచడం తగదని పేర్కొంది. ఎలక్టోరల్ బాండ్ల మొత్తాన్ని తిరిగిచ్చేయాలని సుప్రీం ఆదేశించింది. రాజకీయ పార్టీలకు నిధులు అనుమతించే ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది.