టీచరే ఇలా ఉంటే...దేశం ఏమవుతుంది?

Update: 2023-08-26 06:46 GMT

భావి తరాలను తీర్చిదిద్దేది టీచర్లు. వాళ్ళు వేసిన విత్తులే పెరిగి పెద్దై మొక్కలు అవుతారు. కానీ ఓ టీచర్ మాత్రం బుద్ధి లేకుండా ప్రవర్తించారు. సమానత్వం గురించి నేర్పించాల్సిన ఆవిడే పిల్లలను విడదీసింది. అసలే నివురుగప్పిన నిప్పులా ఉన్న మన మత, కుల వ్యవస్థలను పిల్లల బుర్రల్లోకి ఎక్కించింది. ఒక ముస్లిం కుర్రాడిని హిందువు పిల్లల చేత కొట్టించింది. అది కూడా స్కూల్లోనే.

టీచర్ అయితే ఏమైనా చేయొచ్చు అనుకుంటారు కాబోలు. అదే ధైర్యంతో ఈ చెత్తపనికి పాల్పడింది ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లోని ఓ టీచర్. క్లాసులో ఓ ముస్లిం కుర్రాడిని మిగతా హిందువుల పిల్లల చేత కొట్టించింది. ఇది వీడియోగా ఎవరు తీశారో, ఎలా సోషల్ మీడియాలోకి వచ్చిందో తెలియదు కానీ...ఈ ఘటన ఇప్పుడు చాలా వైరల్ అవుతోంది. ముస్లిం పిల్లాడు నిల్చుని ఉంటే టీచర్ ఒక హిందూ కుర్రాడిని పిలిచి కొట్టమంటుంది. ఆ అబ్బాయిని కొట్టిన తర్వాత అలా క్కాదు ఇంకా గట్టిగా కొట్టు అంటుంది. అక్కడితో ఆగకుండా మిగతా పిల్లలందరినీ పిలిచి కూడా అలానే చేయించింది. కడుపులో కొట్టండి, వీపు మీద తన్నండి అంటూ తనలో ఉన్న పైశాచికత్వాన్ని బయటపెట్టింది. పైగా మధ్యమధ్యలో ముస్లిం మతం గురించి అసభ్యంగా మాట్లాడ్డం, తిట్టడం కూడా వీడియోలో రికార్డ్ అయింది. పిల్లవాడు ఏడుస్తున్నా పట్టించుకోలేదు ఆ మహాతల్లి.




 


వీడియో బయటకు వచ్చిన తర్వాత పోలీసులు దీన్ని సీరియస్గా తీసుకున్నారు. ఏ స్కూలో తెలుసుకుని వెళ్ళి విచారిస్తున్నారు. ఆ స్కూల్ ప్రిన్సిపల్ తో మాట్లాడారు. కేవలం ఎక్కాలు సరిగ్గా రాలేదన్న కారణంగా ఇంతటి పని చేసిందట ఆ టీచర్. ఈ విషయం మీద ముజఫర్ నగర్ విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు వెళ్ళింది. వాళ్ళు ఉపాధ్యాయురాలిపై దర్యాప్తుకు ఆదేశించారు. మరోవైపు విద్యార్ధి తండ్రి తన కొడుకును స్కూల్ మాన్పించేశారు. స్కూల్ యాజమాన్యం ఈ విషయం బయటకు రాకుండా తనతో అగ్రిమెంట్ చేయించుకుందని...తన కొడుకు అడ్మిషన్ ఫీజు కూడా వెనక్కు తిరిగి ఇచ్చేశారని చెప్పారు. కానీ సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో అంతా బయటకు వచ్చిందని తెలిపారు. ఈ వీడియో ను చూసినవారందరూ టీచర్ ను తెగ తిడుతున్నారు. దీనిపై రాహుల్ గాంధీ కూడా స్పందించారు. ఓ టీచర్ దేశానికి ఇంతకు మించి చేసే ద్రోహం మరొకటి ఉండదని ఆయన అన్నారు.


Tags:    

Similar News