దర్శకుడు శంకర్‌కు భూకేటాయింపు.. సమర్థించిన హైకోర్టు

Update: 2023-07-07 08:33 GMT

ప్రముఖ సినీ దర్శకుడు ఎన్‌.శంకర్‌కు రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్‌పై తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. భూకేటాయింపు ప్రక్రియను న్యాయస్థానం సమర్థిస్తూ.. ఈ విషయంలో జోక్యం చేసుకోలేమంటూ పిల్‌ను కొట్టివేసింది. ఇక బుధవారం జరిగిన విచారణలో హైకోర్టు... స్టూడియో నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయిస్తే తప్పేమిటని పిటిషనర్‌ను ప్రశ్నించింది. భూకేటాయింపులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు ఉన్నాయని, ఒక్కో అవసరానికి ఒక్కో విధానం ఉటుందని అభిప్రాయపడింది. సినీ రంగానికి, క్రీడాకారులకు భూములను కేటాయిస్తుందని, ఇందులో తప్పు పట్టాల్సిన అవసరం ఏముంటుందని పేర్కొన్నది. ప్రఖ్యాత దర్శకులు సత్యజిత్‌ రే, హజారికాకు ఆయా ప్రభుత్వాలు భూములు ఇచ్చాయని గుర్తు చేసింది.




 


రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం మోకిల్లా గ్రామంలో సర్వే నం.8లో ఎకరం రూ.5 లక్షల చొప్పున 5 ఎకరాలను శంకర్‌కు కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. దీన్ని సవాల్‌ చేస్తూ కరీంనగర్‌కు చెందిన జే శంకర్‌ 2020లో పిటిషన్ దాఖలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ తుకారాంజీతో కూడిన ధర్మాసనం ఈ రోజు(శుక్రవారం) తీర్పు వెలువరించింది.




 


అంతకుముందు.. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ, సినీ పరిశ్రమను ప్రోత్సహించే క్రమంలోనే దర్శకుడు శంకర్‌కు భూమి కేటాయింపు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. సినిమా పరిశ్రమ అభివృద్ధికి, ఉద్యోగ కల్పనకు దోహదపడేలా భూమి కేటాయించామని చెప్పారు. శంకర్‌ తరఫు సీనియర్‌ న్యా యవాది శ్రీరఘురాం వాదనలు వినిపిస్తూ ప్రతిభ ఉండి ఆర్థికస్థోమత లేకపోవడం వల్లే ప్రభుత్వం నుంచి భూమిని తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు.




Tags:    

Similar News