Train Incident: ప్లాట్​ఫాంపైకి దూసుకొచ్చిన రైలు.. అదృష్టం బాగుండి బతికిపోయారు.. వీడియో

Update: 2023-09-27 04:36 GMT

బ్రేకులు ఫెయిల్ అవడతో నేరుగా ప్లాట్​ఫాంపైకి ఒక్కసారిగా దూసుకొచ్చింది ఓ రైలు. అదృష్టవశాత్తూ ఆ రైలు ఇంజన్ పిల్లర్‌ను ఢీకొని ఆగిపోయింది. లేకుంటే ప్లాట్​ఫాంపై రైలు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికుల మీదకి వచ్చినట్లయితే ఘోర ప్రమాదం జరిగిఉండేది. ఉత్తర్​ప్రదేశ్​లోని మథుర రైల్వేస్టేషన్​లో ఈ ఘటన జరిగింది. రైలు పిల్లర్ ని ఢీకొని అక్కడే ఆగిపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. శుకర్​ బస్తీ స్టేషన్​ నుంచి వచ్చిన ఈఎంయూ ప్యాసింజర్​ రైలు.. ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. అయితే బయల్దేరే సమయంలో అకస్మాత్తుగా రైలు బ్రేకులు ఫెయిలయ్యాయి. రైలు ఇంజన్ ట్రాక్‌పై ఉన్న స్లీపర్‌ను బద్దలు కొట్టి ప్లాట్‌ఫారమ్ నంబర్ 2 పైకి ఎక్కి భారీ ఇనుప స్తంభాన్ని ఢీకొట్టి ఆగిపోయింది.

ప్రమాదం గురించి విషయం తెలిసిన వెంటనే రైల్వే అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. రైల్వే అధికారి అక్కడికక్కడే విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం వల్ల అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన వల్ల పలు రైళ్ల రాక ఆలస్యమైందని అధికారులు చెప్పారు. ప్రమాదం అనంతరం ప్రయాణికులంతా.. రైల్వే కంపార్ట్​మెంట్​లో కాసేపు సేదతీరారు. పెను ప్రమాదం తప్పిందని తెలిపారు.

Tags:    

Similar News