Udhayanidhi Stalin: 'సనాతన వ్యాఖ్యల'పై ఉదయనిధికి కోర్టు సమన్లు..

Update: 2024-02-02 16:30 GMT

తమిళనాడు క్రీడా శాఖ మంత్రి, సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌కు కర్ణాటక కోర్టు సమన్లు పంపింది. మార్చి 4వ తేదీన కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. గతేడాది ఆయన సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో ఈ సమన్లు పంపింది. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాలతో పోలుస్తూ ఉదయనిధి స్టాలిన్ గత ఏడాది చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి.. బీజేపీ ఈ వ్యాఖ్యల్ని తప్పు పట్టింది. దేశవ్యాప్తంగా పలు చోట్లు హిందువులు తమ మనోభావాలను దెబ్బతీశాడని చెబుతూ.. ఉదయనిధిపై కేసులు పెట్టారు. చాలా మంది ఆయనపై తీవ్రంగా స్పందించారు. ఎన్నికల్లోనూ ఈ విషయంపై రచ్చ జరిగింది. ఇండియా కూటమి ఎమ్మెల్యేనే ఈ వ్యాఖ్యలు చేశాడని, కాంగ్రెస్ వైఖరి కూడా ఇదేనా? అని ప్రత్యర్థి పార్టీలు ప్రశ్నల వర్షం కురిపించాయి.

కానీ, స్టాలిన్ మాత్రం తన వైఖరిని మార్చుకోలేదు. తాను తప్పేమీ మాట్లాడలేదని ఉదయనిధి స్టాలిన్ సమర్థించుకున్నారు. తన వ్యాఖ్యలపై తాను న్యాయపరంగా ఎదుర్కోవడానికి సిద్ధం అని వివరించారు. అంతేకానీ, తన వైఖరి మార్చుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తన భావజాలాన్ని మాత్రమే తాను మాట్లాడానని గతేడాది ఓ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ విషయంపై పరమేశ్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంట్‌ను కర్ణాటక ప్రజా ప్రతినిధుల కోర్టు స్వీకరించింది. అనంతరం, ఉదయనిధి స్టాలిన్‌కు సమన్లు పంపింది. మార్చి 4వ తేదీన కోర్టుకు రావాలని ఆదేశించింది. సెప్టెంబరు 2023లో జరిగిన ఒక సదస్సులో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ, సనాతన ధర్మం సామాజిక న్యాయం మరియు సమానత్వానికి విరుద్ధమని, దానిని నిర్మూలించాలని అన్నారు.




Tags:    

Similar News