Police men Fight On Road:పిడిగుద్దులు, లాఠీలతో నడిరోడ్డుపైనే కొట్టుకున్న పోలీసులు

Byline :  Veerendra Prasad
Update: 2023-09-19 02:28 GMT

పట్టపగలు నడిరోడ్డులో ఇద్దరు పోలీసు అధికారులు గొడవ పడ్డారు. ప్రజలకు రక్షణ కల్పించడంతోపాటు నేరగాళ్లను పట్టుకోవాల్సిన పోలీసులు.. ఇలా తమ ఇద్దరి మధ్య గొడవను రోడ్డుపాలు చేయడంతో.. ఆ దారిలో వెళ్లేవారంతా... అవాక్కయ్యారు. నడిరోడ్డుపై పోలీసులకు ఈ గొడవేంటి అంటూ ఇద్దరికీ సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. ఈ ఆశ్చర్యకర సంఘటన బిహార్​లోని నలంద జిల్లాలో వెలుగు చూసింది. ఈ మొత్తం సంఘటనను అక్కడే ఉన్న ఓ స్థానికుడు మొబైల్​ ఫోన్​లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్​ చేశాడు. ఈ వీడియో వైరల్‌గా మారి జిల్లా ఎస్​పీ దృష్టికి వెళ్లింది. అసలేం జరిగిందంటే..

సొహ్సరాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే హాల్ట్ సమీపంలో ఉన్న డయల్ 112 డివిజన్‌లో పనిచేస్తున్న పోలీసు అధికారుల మధ్య ఈ గొడవ జరిగింది. ఓ కేసు విషయంలో లంచం తీసుకున్నందుకు ఒక అధికారి.. మరొక అధికారిపై చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది. కేసు సెటిల్​మెంట్​ కింద సదరు వ్యక్తి దగ్గర తీసుకున్న డబ్బును.. వాటాలుగా పంచుకునే విషయంలో తేడాలు రావడం వల్ల ఈ గొడవ జరిగిందని ఇంకొందరు అంటున్నారు. ఈ సమయంలో పోలీస్​ వాహనంలో నుంచి బయటకు దిగి మరీ రోడ్డుపైనే కొట్టుకున్నారు. దీనితో అక్కడే ఉన్న ఓ స్థానికుడు ఆ దృశ్యాలను వీడియో తీసి సోషల్​ మీడియాలో షేర్​ చేశాడు. ఇది వైరల్​గా మారి జిల్లా ఎస్​పీ అశోక్ మిశ్రా కంటపడింది. దీనిపై స్పందించిన ఆయన వెంటనే చర్యలు తీసుకున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన స్పష్టమైన కారణంతో పాటు ఆ ఇద్దరు పోలీసుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.




Tags:    

Similar News