రైల్వే స్టేషన్‌లో కరెంట్ షాక్.. మహిళా టీచర్ మృతి

Update: 2023-06-26 03:00 GMT

భారీ వర్షం ఓ మహిళా ప్రాణం తీసింది. ఫ్యామిలీతో కలిసి వేరే రాష్ట్రం వెళ్లాలనుకున్న ఓ టీచర్.. అనంతలోకాలకు వెళ్లింది. రైల్వే స్టేషన్ లో కరెంట్ షాక్ రూపంలో ఆమెను మృత్యువు కబళించింది. ఈ ఘటన ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగింది. ఢిల్లీలోని ప్రియదర్శిని విహార్‌ ప్రాంతంలో సాక్షి అహుజ అనే మహిళ ప్రైవేటు స్కూలులో టీచర్గా పనిచేస్తోంది. చండీగఢ్‌ వెళ్లేందుకు ఉదయం 5.30 సమయంలో ఆరుగురు కుటుంబసభ్యులతో కలిసి రైల్వేస్టేషనుకు చేరుకున్నారు.




 

ఈ క్రమంలో రోడ్డుపై నిలిచిన వర్షపునీటిని దాటే ప్రయత్నంలో సాక్షి పట్టు తప్పి పక్కనే ఉన్న విద్యుత్తు స్తంభాన్ని తాకింది. దీంతో షాక్కు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. విద్యుత్తు స్తంభం వద్ద వైర్లు బయటకు రావడంతో కరెంట్ షాక్ కొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఘటనాస్థలంలో సాక్షి సోదరి బోరున విలపించడం అక్కడున్న వారిని కలిచివేసింది. సాక్షికి ఇద్దరు పిల్లలు ఉండగా.. భర్త అంకిత్‌ అహుజా ఓ జపాన్‌ కంపెనీలో ఇంజినీర్గా పనిచేస్తున్నారు.  


Tags:    

Similar News