నన్ను టార్గెట్ చేశారు.. అందుకే ఈ ఆరోపణలు.. ఓఎస్డీ హరికృష్ణ

Update: 2023-08-13 07:30 GMT

హకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌లో బాలికలతో ఓఎస్డీ అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. హకీంపేట్ ఓ.ఎస్.డి హరికృష్ణను సస్పెండ్ చేసింది. ఈ క్రమంలో లైంగిక వేధింపులకు పాల్పడిన  ఓఎస్డీ హరికృష్ణ స్పందించారు. విచారణలోనే అసలు నిజాలు బయటకు వస్తాయని అన్నారు. వేధింపులు నిజం కాదని, తనపై కావాలనే ఆరోపణలు చేస్తున్నారని హరికృష్ణ చెప్పారు. తాను హాస్టల్‌లోకి వెళ్లానన్నది పెద్ద అబద్ధమన్న ఆయన.. స్పోర్ట్స్ స్కూల్ కు వస్తున్న మంచి పేరు చూసి ఓర్వలేక తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

స్పోర్ట్స్ స్కూల్ బాలికలు తనను డాడీ అని పిలుస్తారని హరికృష్ణ చెప్పారు. అక్కడున్న బాలికలంతా తన కూతురుతో సమానమని అన్నారు. ఎలాంటి అధికారి కూడా లైంగిక వేధింపులు పాల్పడలేదని.. ఇవన్నీ అవాస్తవమని చెప్పారు. తాను కూడా బాలికల స్కూల్ హాస్టల్ లో షార్ట్ & టీ షర్ట్ కూడా వేసుకోనని అంత కఠినంగా ఉంటానని అన్నారు. ఎవరో ఉద్దేశపూర్వకంగానే తనపై ఆరోపణలు చేస్తూ డర్టీ పాలిటిక్స్ నడుపుతున్నారని అని మండిపడ్డారు.

3 ఏళ్లుగా స్పోర్ట్స్ స్కూల్ లో స్పెషల్ ఆఫీసర్ గా పని చేస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి ఆరోపణలు లేవని హరికృష్ణ అన్నారు. సెలక్షన్స్ టైంలోనే తనని టార్గెట్ చేశారని ఆరోపించారు. విద్యార్థినుల్ని అడిగితే అసలు నిజాలు తెలుస్తాయని చెప్పారు. తనపై ఇలాంటి ఆరోపణలు రావడం దురదృష్టకరమన్నారు. తనపై వచ్చిన ఆరోపణలు నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్దమని హరికృష్ణ స్పష్టం చేశారు.

హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ లో బాలికలపై లైంగిక వేధింపుల ఘటనను తెలంగాణ సర్కార్ సీరియస్ గా తీసుకుంది. బాలికలపై వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఎదురుకుంటున్న అధికారి హరికృష్ణపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఈ ఘటనపై దర్యాప్తునకు ఉన్నతాధికారులతో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, నిందితులపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మూడు రోజుల్లో విచారణ పూర్తి చేసి జైలుకు పంపిస్తామన్నారు. మహిళలను వేధిస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.

Tags:    

Similar News