కృష్ణా జలాల వివాదం.. జనవరి 12కు వాయిదా

Byline :  Bharath
Update: 2023-12-02 04:42 GMT

కృష్ణా జలాల వివాదంపై విచారణను సుప్రీంకోర్టు జవనరి 12కు వాయిదా వేసింది. కృష్ణా ట్రిబ్యునల్ 2కు సంబంధించిన టీవోఆర్ ను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై గత నెలలో కేంద్రం తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం వేసిన ఈ పిటిషన్ పై కౌంటర్ వేయాలని ఆదేశించింది. దీనిపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన బెంచ్ శుక్రవారం విచారణ జరిపింది. అయితే దీనిపై కౌంటర్ వేయడానికి కొంత టైం కావాలని కేంద్ర జలశక్తి శాఖ తరపు అడ్వకేట్ సుప్రీం కోర్టును కోరారు. దీనికి అంగీకరించిన ధర్మాసనం విచారణను జనవరి 12కు వాయిదా వేసింది.

కాగా శనివారం కేంద్ర హోంశాఖ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు అజయ్ భల్లా కీలక సూచనలు చేశారు. నవంబర్ 28కి ముందు ఉన్న స్థితినే కొనసాగించాలని చెప్పారు. డ్యామ్ నిర్వహణ కేఆర్ఎంబీ చూసుకుంటుందని తెలిపారు. ఇకపై డ్యామ్ సీఆర్పీఎఫ్ పర్యవేక్షణలో ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ప్రతిపాదనలను తెలుగు రాష్ట్రాలు అంగీకరించాయి.

కాగా అంతకుముందు సాగర్ కుడికాలువ నుంచి నీరు తీసుకోవడం వెంటనే ఆపాలని ఏపీ ప్రభుత్వాన్ని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆదేశించింది. ఈ మేరకు ఏపీ జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శికి కేఆర్‌ఎంబీ కార్యదర్శి లేఖ రాశారు. ఏపీకి 3 విడతల్లో నీటిని విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు తెలిపింది. అక్టోబర్‌ కోసం అడిగిన 5 టీఎంసీల్లో ఇప్పటికే 5.01 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు చెప్పింది. 2024 జనవరి, ఏప్రిల్‌లో నీరు విడుదల చేయాల్సి ఉందని తెలిపిన బోర్డు.. ముందు అడగకుండా నీటిని ఎలా విడుదల చేస్తారని ప్రశ్నించింది.

Tags:    

Similar News