KCR's farmhouse: ఫామ్‌హౌజ్‌పై దాడి చేస్తే వందల కోట్లు బయటపడ్తాయ్.. మధుయాష్కీ

Byline :  Veerendra Prasad
Update: 2024-01-28 14:27 GMT

త్వరలోనే బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ కేసీఆర్‌ ఫామ్‌ హౌస్‌పై విచారణ చేసి అవినీతిని వెలికితీస్తామని హెచ్చరిక చేశారు కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కి. దీంతో, తెలంగాణలో రాజకీయం మరోసారి రసవత్తరంగా మారింది. ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన మధుయాష్కీ ..కేసీఆర్ ఫామ్‌హౌజ్‌పై దాడి చేస్తే వందల కోట్లు బయటకు వస్తాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. సంక్షేమ పథకాల పేరుతో అవినీతికి పాల్పడిన ఎవరినీ విడిచిపెట్టమని హెచ్చరించారు. ఇప్పటికే మంత్రులు, అధికారులు అన్ని శాఖలతో సమీక్షలు నిర్వహించి వాస్తవ పరిస్థితి ఏంటో తెలుసుకున్నారని.. ఇక మిగిలించి బీఆర్ఎస్ నేతల చిట్టా బయటకు చెప్పడమే అని కీలక వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీఆర్‌ఎస్‌ నేతలు గుంట నక్కలా వేచి చూస్తున్నారని... కానీ, తమ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని అన్నారు. బీఆర్ఎస్‌ను వీడేందుకు చాలామంది నేతలు సిద్ధంగా ఉన్నారని, కానీ, తామే పార్టీలోకి తీసుకునేందుకు ఆలోచిస్తున్నామని తెలిపారు. తాను పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల వరకు తెలంగాణ పీసీసీ చీఫ్‌లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పీసీసీ అధ్యక్ష పదవి ప్రస్తుతం ఖాళీగా లేదని, అధిష్టానం బాధ్యతలు ఇస్తే నిర్వహిస్తానని స్పష్టం చేశారు.

కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో మధుయాష్కీ గౌడ్ ఘోర పరాజయం పాలయ్యారు. సమీప బీఆర్ఎస్ అభ్యర్థి దేవీరెడ్డి సుధీర్ రెడ్డి చేతిలో ఓటమి చెందారు. ఓటమితో మొన్నటివరకు కాస్త సైలెంట్‌గా ఉన్న ఆయన.. ఇటీవల దూకుడు పెంచారు. బీఆర్ఎస్ నేతల విమర్శలకు ఘాటుగా కౌంటర్ ఇస్తున్నారు. దీంతో ఆయనకు ప్రభుత్వంలో ఏదో ఒక నామినేటెడ్ పోస్టు ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు వార్తలు వినవస్తున్నాయి.

Tags:    

Similar News