ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. ఒక బీజేపీ కార్యకర్తతో సమానం: బండి సంజయ్

Update: 2023-07-21 10:42 GMT

నాంపల్లిలో జరిగిన కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న బండి సంజయ్ బీఆర్ఎస్ తీరుపై తీవ్రంగా మండి పడ్డారు. వర్షాల వల్ల రైతులు, ప్రజలు అవస్తలు పడుతుంటే.. కేసీఆర్ ఫామ్ హౌజ్ లో పడుకుని సినిమా చూస్తున్నరని విమర్శించారు. బీజేపీ కార్యక్రమాన్ని తప్పుదోవ పట్టించేందుకు కొత్త నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఇప్పుడు పీఆర్సీ కమిషన్ చేస్తాను అంటున్నారు. రేపు మొదటి తారీకు జీతాలు పడుతై అంటారు. ఎన్నికల ముందు అన్నీ పనులు జరుగుతాయి. ఇదంతా కేసీఆర్ ఆడుతున్న డ్రామా అని బండి సంజయ్ విమర్శించారు.

ఉద్యోగులు అన్నీ చూస్తున్నరని, వాళ్లను హింసించిన విషయం ఎప్పటికీ మర్చిపోరని తెలిపారు. రాష్ట్రంలో పేదలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తున్నరని, రాష్ట్ర ప్రభుత్వం దౌర్జన్యం, నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హామీలు నిలబెట్టే వరకు బీజేపీ పోరాటం ఆగదని బండి అన్నారు. రైతులు అంటే గిట్టని కేసీఆర్.. వాళ్లకు ఇవ్వాల్సిన రుణమాఫీ, రూ.10 వేల పరిహారం ఇవ్వకుండా ఉసురు పోసుకుంటున్నాడని ఆరోపించారు.

ఇప్పటి వరకు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం దగ్గర ఎవరు అడుపెట్టలేదని.. ఆ ధైర్యం చేసింది ఒక్క బీజేపీ పార్టీ కార్యకర్తలేనని అన్నారు. ధర్మం కోసం పోరాడటం ఒక్క బీజేపీ కార్యకర్తలకే సాధ్యం అవుతుందని తెలిపారు. పాత బస్తీ ఇక మనదేనని.. అది ఏ మతానికి చెందిన స్థలం కాదని బండి సంజయ్ అన్నారు. ఇప్పటివరకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పాతబస్తీలో అడుగు పెట్టడానికి కూడా భయపడ్డారు. కానీ బీజేపీ కార్యకర్తలు ధర్నాలు చేశారు. మీటింగ్ లు పెట్టి చూపించారని బండి అన్నారు.

రైతు పండించిన ప్రతి గింజ తామె కొంటామని బీఆర్ఎస్ అబద్దపు హామిలిచ్చింది. కానీ, అసలు నిజం.. ప్రతీ గింజ కొని రైతుల పక్షాన నిలబడే ఏకైక పార్టీ బీజేపీ అని బండి సంజయ్ తెలిపారు. నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతుల పక్షాన నిలబడి కొట్లాడే ఏకైక పార్టీ బీజేపీ అని బండి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా ముందు నిలబడేది బీజేపీ కార్యకర్తలేనని ప్రజలకు గుర్తుచేశారు.

రాష్ట్రంలో రామరాజ్యం రావడానికి ప్రతీ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదులు ఇవ్వడం మానేయాలని కోరారు. కనీసం కిషన్ రెడ్డినైనా రాష్ట్రం కోసం ప్రశాంతంగా పనిచేయనీయాలని కోరారు. దుబ్బాకలో, హుజురాబాద్ లో గెలిచాం. ముణుగోడులోనూ నైతిక గెలుపు మాదేనని బండి సంజయ్ అన్నారు. ముణుగోడులో ఒక పోలింగ్ బూత్ కు ఒక ఎమ్మెల్యే ను పెడితే.. బీజేపీ కేవలం కార్యకర్తను నిలబెట్టి పోరాడింది. ప్రజలు బీజేపీపై నమ్మకముంచారు. రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.

Tags:    

Similar News