ఎంపీ టికెట్ ఇవ్వండి.. కాంగ్రెస్కు బండ్ల గణేష్ దరఖాస్తు..
లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలన్నీ గెలుపు గుర్రాల వేటలో బిజీ అయ్యాయి. రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో బలమైన అభ్యర్థులను బరిలో నిలిపేందుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ సైతం అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించింది. క్యాండిడేట్ల ఎంపికలో అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన విధానాన్నే అమలు చేయాలని నిర్ణయించింది. పార్లమెంట్ బరిలో నిలిచే అభ్యర్థుల నుంచి కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఇందుకోసం హైదరాబాద్ గాంధీ భవన్లో ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలువురు ఆశావహులు దరఖాస్తులు సమర్పించారు. ఫిబ్రవరి 3 వరకు నుంచి అప్లికేషన్లు స్వీకరించనున్నారు.
మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు భారీ సంఖ్యలో ఆశావహులు దరఖాస్తు చేసుకుంటున్నారు. తాజాగా ఆ ఎంపీ సీటు టికెట్ కోసం సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కూడా అప్లై చేసుకున్నారు. గాంధీ భవన్ వెళ్లి తన దరఖాస్తు అందజేశారు. ఇదిలా ఉంటే త్వరలో మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నారని, ఆయనకు ఆ ఎంపీ టికెట్ ఇవ్వనున్నారని జోరుగా ప్రచారం సాగుంతోంది. ఈ నేపథ్యంలో మినీ ఇండియా పేరొందిన మల్కాజ్గిరి ఎంపీ టికెట్ను కాంగ్రెస్ హైకమాండ్ ఎవరికి ఇస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉంటే ఎంపీ టికెట్ కోసం ఇప్పటికే పలువురు దరఖాస్తు చేసుకున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని ఖమ్మం పార్లమెంటు టికెట్ ఆశిస్తున్నారు. గురువారం ఆమె అనుచరులు గాంధీభవన్లో అప్లికేషన్ అందజేశారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు కూడా అదే టికెట్ కోసం దరఖాస్తు చేశారు. భువనగిరి స్థానానికి పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్కుమార్రెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్, కె.నగేశ్ అప్లికేషన్ పెట్టుకున్నారు. నాగర్కర్నూల్ టికెట్ కోసం మాజీ ఎంపీ మంద జగన్నాథం, మల్కాజ్గిరి సీటు కోసం మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్కుమార్, నిజామాబాద్ నుంచి మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, వరంగల్ నుంచి న్యాయవాది చల్లూరి మధు దరఖాస్తులు సమర్పించారు.