Breaking News: రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేత

Update: 2023-10-22 06:26 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ హైకమాండ్ సంచలన నిర్ణయం తీసుకుంది. గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. ఈ మేరకు సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ పార్టీ అధిష్ఠానం ఆదివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీంతో అందరూ ఊహించినట్లుగానే బీజేపీ ఫస్ట్ లిస్ట్‌లోనే రాజాసింగ్ పేరు ఉండనున్నట్లు తెలుస్తోంది. కాగా, గతేడాది ఆగస్టు 22వ తేదీన సోషల్ మీడియాలో రాజాసింగ్ ఓ వీడియో అప్‌లోడ్ చేశారు. ఆ వీడియోలో మహ్మద్ ప్రవక్తను కించపర్చేలా ఉందని ఎంఐఎంతో పాటు ముస్లింలు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే రాజాసింగ్‌పై బీజేపీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసింది. సెప్టెంబర్ 2లోగా వివరణ ఇవ్వాలని రాజాసింగ్‌ను పార్టీ ఆదేశించింది. బీజేపీ శాసనసభా పక్ష నేత స్థానం నుంచి కూడా పార్టీ ఆయనను తొలగించిన విషయం తెలిసిందే. రాజాసింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. దీంతో ఆగస్టు 23న ఆయనను అరెస్ట్ చేశారు. అయితే అదే రోజు ఆయనకు నాంపల్లి కోర్టు బెయిల్ ఇచ్చింది. ఎన్నికల వేళ ఎట్టకేలకు ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేయడంతో బీజేపీ శ్రేణులు, హిందూత్వ వాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. నేడు బీజేపీ అభ్యర్థులకు సంబంధించి తొలి జాబితా విడుదల కానుంది. ఇక, ఈ జాబితాలోనే గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ పేరు కూడా ఉన్నట్టు సమాచారం.




 


Tags:    

Similar News