కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశంపై కాంగ్రెస్‌కు బండి సంజయ్‌ కౌంటర్‌

Byline :  Veerendra Prasad
Update: 2024-01-11 07:07 GMT

రాష్ట్రంలో యువతను డ్రగ్స్‌, మద్యానికి బానిసలుగా చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ (Bandi Sanjay) విమర్శించారు. మద్యం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.40వేల కోట్లు ఆర్జిస్తోందన్నారు. కాలేజీల అడ్డాగా మత్తుపదార్థాల దందా జరుగుతోందని ఆరోపించారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా కరీంనగర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు బండి సంజయ్‌. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ.. రామమందిర నిర్మాణం బీజేపీ కార్యక్రమం కాదని.. దీన్ని రాజకీయం చేయడం కాంగ్రెస్‌కు తగదన్నారు. అయోధ్య రామమందిరాన్ని కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఎందుకు వ్యతిరేకిస్తుందో అర్థం కావడం లేదన్నారు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రతి భారతీయుడూ పాల్గొనాల్సిన చారిత్రక, ధార్మిక కార్యక్రమమని.. రాముడు అందరివాడని పేర్కొన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ చెప్పిందని.. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై విచారణ ఎందుకు జరిపించడం లేదని ప్రశ్నించారు. కేవలం మేడిగడ్డ బ్యారేజీపైనే ఎందుకు జ్యూడిషియల్ విచారణ అడుగుతున్నారని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం కోరితే సీబీఐ విచారణ జరిపించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. కాంగ్రెస్ తీరు బీఆర్ఎస్ నేతల అవినీతిని కప్పిపుచ్చేలా ఉందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ కోరాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

Tags:    

Similar News