కిషన్ రెడ్డి దూకుడు.. పార్టీ నేతలతో కీలక సమావేశం

Update: 2023-07-05 17:23 GMT

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆ పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. మంగళవారం ఢిల్లీ వెళ్లిన ఆయన ఇవాళ హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఈటల రాజేందర్ సహా పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఎయిర్ పోర్టు నుంచి రాడిసన్ హోటల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత పార్టీ నాయకులతో కిషన్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర పదాధికారులు, జాతీయ కార్యవర్గ సభ్యులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో ప్రధాని మోదీ వరంగల్ పర్యటన, బహిరంగ సభ ఏర్పాట్లపై ప్రధానంగా చర్చించనట్లు తెలుస్తోంది. అదేవిధంగా ప్రస్తుతం పార్టీలో నెలకొన్న పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసమావేశం ఇదే. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ భారీ మార్పులు చేస్తోంది. అందులో భాగంగానే పార్టీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని, ఎన్నికల కమిటీ చైర్మన్గా ఈటల రాజేందర్ను నియమించింది.

మరోవైపు బండి సంజయ్ కు కేంద్ర సహాయ మంత్రి పదవి ఇస్తారనే వార్తలొస్తున్నాయి. సంజయ్ హయాంలో పార్టీ గ్రాఫ్ బాగా పెరిగిందనే భావనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయనకు సముచిత స్థానం కల్పించే యోచనలో ఉన్నట్లు సమాచారం. పార్టీ అధ్యక్షుడిగా ఎంపికైన కిషన్ రెడ్డిని కేంద్రమంత్రి పదవి నుంచి తప్పించి.. బండి సంజయ్ను మంత్రి వర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది.

Tags:    

Similar News