కవిత అరెస్టుకు నిరసనగా బీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళనలు

Byline :  Vamshi
Update: 2024-03-16 06:45 GMT

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. ఆమెను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు నల్ల జెండాలు పట్టుకుని నిరసలకు దిగారు. వరంగల్, హనుమకొండతో పాటు ఇతర జిల్లాల్లో రోడ్లపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఇక కవిత అరెస్టుకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

మీర్‌పేటలో ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేసిన బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు.. మోదీ డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. బోరబండ బస్టాండ్‌ వద్ద ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిరసనలతో హోరెత్తించారు. ఇల్లందు పట్టణంలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు నిరసన ర్యాలీ చేపట్టారు. కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. అశ్వారావుపేట రింగురోడ్డు సెంటర్‌లో పార్టీ నాయకులు ధర్నా చేశారు.

Tags:    

Similar News