బీజేపీ ఎంపీ బండి సంజయ్‌పై కేసు నమోదు

Byline :  Vamshi
Update: 2024-03-28 09:58 GMT

బీజేపీ ఎంపీ బండి సంజయ్‌పై సహా తొమ్మిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బోడుప్పల్ సమీపంలోని చెంగిచర్లలో పోలీసు విధులకు ఆటంకం కలిగించినందుకుగాను ఈ కేసు నమోదైంది. కాగా హొళీ పండుగ నాడు హిందూ, ముస్లిం వర్గాల మధ్య ఘర్షణ జరిగిన నేపథ్యంలో ఆ ప్రాంతంలో పర్యటించేందుకు బండి సంజయ్ నిన్న అక్కడికి చేరుకున్నారు. బండి సంజయ్‌ను పోలీసులు అనుమతించకపోవడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. విధి నిర్వహణలో ఉన్న తనపై దాడి చేశారని నాచారం సీఐ నందీశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదు చేశారు.

బండి సంజయ్‌తో పాటు ఘట్‌కేసర్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, మరికొందరిపై కేసు నమోదయింది. ఓ వర్గం దాడిలో గాయపడిన మహిళలను పరామర్శించేందుకు బండి సంజయ్ నిన్న చెంగిచెర్లలోని పిట్టలబస్తీకి వెళ్లారు. బండి సంజయ్ అక్కడకు రావడంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక్కడకు రావడానికి అనుమతి లేదని పోలీసులు చెప్పారు. ఎవరినీ లోనికి అనుమతించకుండా బారీకేడ్లను ఏర్పాటు చేశారు. అక్కడకు చేరుకున్న బండి సంజయ్, కార్యకర్తలు బారీకేడ్లను తోసుకొని లోనికి వెళ్లారు. ఘటనలో గాయపడిన మహిళలను పరామర్శించారు. వారికి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. మహిళలపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News