కాంగ్రెస్, బీజేపీకి అధికారమిస్తే ఏమైతదో ప్రజలకు తెలుసు - సీఎం కేసీఆర్

By :  Kiran
Update: 2023-11-02 10:54 GMT

ప్రతిపక్షాల మాటలు విని వారికి ఓటేస్తే ఆగమైతరని సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీకి అధికారం అప్పగిస్తే ఏమైతదో ప్రజలందరికీ తెలుసని చెప్పారు. ఓటు ఓ వజ్రాయుధమని, దాన్ని సరిగా ఉపయోగించకపోతే ప్రజల తలరాత, ఐదేళ్ల జీవితాన్ని కింద మీద చేస్తదని అన్నారు. బాల్గొండలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ఆయన.. కాంగ్రెస్, బీజేపీలపై ఫైర్ అయ్యారు.

కాంగ్రెస్ పార్టీ ఒక్క ఛాన్స్ ఇవ్వమని ప్రజల్ని కోరుతోందని, 11 సార్లు అవకాశం ఇస్తే ఏ చేశారని కేసీఆర్ ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీల వైఖరి, వారి మాటలు, అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో ఆలోచించాలని సూచించారు. దేశంలో తెలంగాణ తప్ప ఏ రాష్ట్రం కూడా 24 గంటల కరెంటు ఇవ్వడంలేదని గుర్తుచేశారు.

ప్రధాని నరేంద్ర మోడీకి ప్రైవేటైజేషన్ పిచ్చి పట్టిందని కేసీఆర్ విమర్శించారు. అందుకే అన్నింటినీ ప్రైవేటుపరం చేస్తున్నారని మండిపడ్డారు. సంస్కరణల పేరుతో కేంద్ర సర్కారు బాయికాడి మోటర్ల వద్ద మీటర్లు పెట్టాలంటున్నారని, ఏటా రూ. 25వేల కోట్ల నష్టం అని తెలిసినా అందుకు అంగీకరించలేదని చెప్పారు. తెలంగాణ ఏర్పడే నాటికి వలసలు, కరువు, కరెంటు, నీళ్లు ఉండేవి కాదని, పదేండ్లలో పరిస్థితిని చక్కదిద్దుకున్నామని కేసీఆర్ గుర్తు చేశారు.

ప్రజలకు తాగు, సాగు నీరు, వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇవ్వడంతో పాటు రైతులకు పెట్టుబడి సాయం అందించడమే కాకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని అన్నారు. ధరణి రాకతో రైతు బంధు, రైతు బీమాతో పాటు ధాన్యం కొనుగోలు డబ్బు నేరుగా రైతుల అకౌంట్లలో పడుతున్నాయని చెప్పారు.


Tags: