వలసల వనపర్తిని వరి పంటల వనపర్తిగా మార్చినం - కేసీఆర్

By :  Kiran
Update: 2023-10-26 12:06 GMT

పిడికెడు మందితో కలిసి పోరాడి తెలంగాణ సాధించానని సీఎం కేసీఆర్ అన్నారు. వనపర్తిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. స్వరాష్ట్రం ఏర్పడిన పదేళ్లలో ఎంత అభివృద్ధి జరిగిందో ప్రజలు గమనించాలని కోరారు. వనపర్తి ఒకప్పుడు వలసల ప్రాంతంగా ఉండేదని ఇప్పుడు వరి పంటల వనపర్తిగా మార్చామని అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తైతే జిల్లా సస్యశ్యామలమవుతుందని కేసీఆర్ చెప్పారు.

రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో కేసీఆర్‌లు ఉన్నారని స్పష్టం చేశారు. తెలంగాణ కోసం గొంతు ఎత్తింది ఎవరో నేతల కాళ్ల దగ్గర కూర్చున్నది ఎవరో.. నేతల కాళ్ల దగ్గర కూర్చున్నది ఎవరో గుర్తించాలని కోరారు. పాలమూరు జిల్లాకు ఏ కాంగ్రెస్‌ నేత అయినా మెడికల్‌ కాలేజీ తెచ్చారా అని కేసీఆర్ ప్రశ్నించారు. ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 5 మెడికల్ కాలేజీలు ఉన్నాయని చె్పారు. రైతులకు ఏ ప్రభుత్వమైనా డబ్బులు ఎదిరిచ్చిందా అన్న కేసీఆర్.. ఎన్ని మోటర్లు పెట్టారని రైతును ఎవరైనా అడుగుతున్నారా అని అన్నారు. రైతులు కట్టాల్సిన రూ.లక్షల కోట్ల కరెంటు బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తోందని గుర్తు చేశారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసినా ప్రజాసంక్షేమం కోసమే చేస్తుందని కేసీఆర్ అన్నారు. ఎన్నికల్లో లబ్ది పొందేందుకు హామీలు ఇవ్వడం లేదని చెప్పారు. విధి వంచితులకు ఇస్తున్న పింఛన్లను దశలవారీగా రూ.5వేలకు పెంచుతామని స్పష్టం చేశారు. మళ్లీ అధికారం చేపట్టిన వెంటనే ఆసరా పింఛను మొత్తాన్ని రూ.3వేలు చేస్తామని, ఆ తర్వాత ఏడాదికి రూ.500 చొప్పున పెంచుతామని చెప్పారు. ధరణి తీసేస్తామని రాహుల్ గాంధీ, భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారని, విమర్శించారు.తెలంగాణను పూల పొదరిల్లులా మార్చిన బీఆర్ఎస్ కావాలో లేక కాంగ్రెస్ కావాలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ సూచించారు.

Tags:    

Similar News