కులమతాలకు అతీతంగా సంక్షేమ ఫలాలు : కేసీఆర్

Update: 2023-06-09 13:36 GMT

పదేళ్ల పసికూన అయిన తెలంగాణ దేశంలోని అనేక రాష్టాలతో అభివృద్ధిలో పోటీ పడుతోందని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ చాలా అంశాల్లో నెంబర్ వన్గా నిలుస్తోందని చెప్పారు. మంచిర్యాల జిల్లాలో ఆయన పర్యటించారు. నూతన కలెక్టరేట్, బీఆర్ఎస్ ఆఫీస్లను సీఎం ప్రారంభించారు. అదేవిధంగా చెన్నూర్‌, పర్ధాన్‌పల్లి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకాలతో పాటు మెడికల్‌ కాలేజీ, ఆయిల్‌ పాం ఫ్యాక్టరీ, మంచిర్యాల - అంతర్గాం బ్రిడ్జికి కేసీఆర్ శంకుస్థాప‌న చేశారు. గృహలక్ష్మీ, కులవృత్తులకు ఆర్థికసాయం పథకాలను ఆయన ప్రారంభించారు.

ప్రజలకు మంచి జరగాలనే కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామని కేసీఆర్ చెప్పారు.రాష్ట్రాభివృద్ధికి ఎన్నో సంస్కరణలు తెచ్చామని.. సంస్కరణలు అనేది నిరంతరం ప్రక్రియ అని అన్నారు. కరోనా, నోట్ల రద్దుతో ప్రజల జీవితాలు అతలాకుతలం అయ్యాయన్న సీఎం.. కష్టకాలంలోనూ తెలంగాణ అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిచిందని స్పష్టం చేశారు. కులమతాలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందిస్తున్నట్లు చెప్పారు. కులవృత్తులకు లక్ష రూపాయల చేయూత అందిస్తున్నామన్నారు.

కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా సాగుతోందని కేసీఆర్ చెప్పారు. ఢిల్లీ పంజాబ్ రాష్ట్రాల్లో కూడా కంటి వెలుగు కొనసాగిస్తామని అక్కడి సీఎం చెప్పారని వివరించారు.

వరి ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ను తెలంగాణ ధాటేసిందన్నారు. గొర్రెల పెంపకంలో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందని తెలిపారు. అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందిస్తున్న అధికారులకు ఆయన అభినందనలు తెలిపారు. దేశానికే తలమానికంగా తెలంగాణ నిలుస్తోందని చెప్పారు.

Tags:    

Similar News