కాంగ్రెస్ వస్తే పదేళ్ల కష్టం బూడిదలో పోసిన ప‌న్నీరు అవుతుంది : కేసీఆర్

Update: 2023-11-17 12:45 GMT

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప‌దేళ్లు ప‌డ్డ క‌ష్టం బూడిద‌లో పోసిన ప‌న్నీరు అవుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ఈ పదేళ్లు ఎంతో శ్రమించామన్నారు. ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద‌లో కేసీఆర్ ప్ర‌సంగించారు. బీఆర్ఎస్ కృషితో తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలో మొదటి స్థానంలో ఉందన్నారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ప్రజల కళ్ల ముందే కన్పిస్తోందని చెప్పారు.

కాంగ్రెస్ పాలనలో దండగా అనుకున్న వ్యవసాయాన్ని బీఆర్ఎస్ వచ్చాక పండగలా మార్చామని కేసీఆర్ చెప్పారు. రైతు బంధు, రైతు బీమా, సాగు నీరు, ధాన్యం కొనుగోలుతో రైతులకు అండగా నిలిచామన్నారు. 24గంటల ఉచిత కరెంట్ అందిస్తామన్నారు. ఇవాళ తెలంగాణ 3కోట్ల మెట్రిక్ టన్నల ధాన్యం పండించే స్థాయికి చేరుకుందన్నారు. ఇంకా కొన్ని ప్రాజెక్టులు పూర్తైతే 4కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించి.. దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదుగుతుందని చెప్పారు.

రైతు బంధు దుబారా అని ఉత్తమ్.. 3గంటల కరెంట్ చాలని రేవంత్ అనడం సిగ్గుచేటని కేసీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణని తీసేస్తామంటున్నారని.. ధరణిని తీసేస్తే మళ్లీ పైరవీకారుల రాజ్యం వస్తుందన్నారు. ధరణి ఉండడం వల్లే భూ పంచాయతీలకు చెక్ పెట్టడంతోపాటు రైతు బంధు డబ్బు సకాలంలో జమవుతుందని చెప్పారు. తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత బీఆర్ఎస్కు దక్కుతుందన్నారు. ఈ ప్ర‌గ‌తి ఇలాగే కొన‌సాగాలంటే బీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.


Tags:    

Similar News