నిమ్స్లో మరో అధునాతన భవనం.. రేపు భూమి పూజ చేయనున్న సీఎం కేసీఆర్

Update: 2023-06-13 04:06 GMT

వైద్య రంగంపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా పేదలకు సైతం కార్పొరేట్ వైద్యం అందేలా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తోంది. ఈ క్రమంలోనే దేశంలోనే అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో ఒకటిగా నిమ్స్​ను తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగ నిమ్స్‌లో కొత్తగా నిర్మించనున్న దశాబ్ది బ్లాక్‌ బిల్డింగ్ కు సీఎం కేసీఆర్ బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. ఈ బిల్డింగ్ అందుబాటులోకి వస్తే ప్రస్తుతం ఉన్న 1800 పడకలకు మరో 2,200 తోడు కానున్నాయి. ఫలితంగా మరింత మందికి మెరుగైన సేవలు అందనున్నాయి. బుధవారం సీఎం కేసీఆర్‌ నిర్వహించే భూమి పూజకు సంబంధించి ఏర్పాట్లను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పర్యవేక్షిస్తున్నారు. ఆయనతో పాటు వైద్య, ఆర్‌అండ్‌బీ అధికారులు ఉన్నారు. భూమి పూజ అనంతరం నిర్వహించే సభ ఏర్పాట్ల గురించి అధికారులకు ఆయన సూచనలు చేశారు. ట్రాఫిక్‌ ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని పోలీసులకు మంత్రి సూచించారు.



 

కొత్తగా 2200 బెడ్స్

నిమ్స్‌లో ఇప్పటికే పాత భవనం, మిలీనియం బ్లాక్‌, సూపర్‌ స్పెషాలిటీ బ్లాకులల్లో పేషెంట్లకు సేవలందిస్తున్నారు. అయితే రోగుల సంఖ్య పెరుగుతుండటం, అందుకు అనుగుణంగా పడకలు, వార్డుల సంఖ్య పెరగడకపోవడంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో కొత్త భవనం నిర్మించి నిమ్స్‌లో సౌకర్యాలు మరింత విస్తృతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎర్రమంజిల్‌ క్వార్టర్స్‌ స్థలం నిమ్స్‌కు అప్పగించడంతో నిమ్స్‌కు అనుబంధంగా 32.16 ఎకరాల్లో కొత్త బిల్డింగ్ నిర్మించనున్నారు. దాదాపు రూ. 1,571 కోట్లతో వ్యయంతో నిర్మించనున్న భవనంలో కొత్తగా 2000వేల బెడ్స్, మరో 200 పడకలతో ఐసీయూ, 34 డిపార్ట్మెంట్లు ఏర్పాటుకానున్నాయి. మాతాశిశు వైద్య సేవల కోసం 50 పడకలను కేటాయించనున్నారు.

అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు

32.16 ఎకరాల స్థలంలో అందులో 23.96 ఎకరాల విస్తీర్ణంలో కొత్త భవన నిర్మాణం జరగనుంది. నాలుగు బ్లాక్‌లుగా ఆస్పత్రి ఏర్పాటుకానుంది. ఏ బ్లాక్‌లో ఓపీడీ, బ్లాక్‌ బి-బ్లాక్‌ డిల్లో ఐపీడీలను ఏర్పాటు చేయనున్నారు. ఇక సీ బ్లాక్ లో ఎమర్జెన్సీ సేవలు ఉంటాయి. ఓపీడీలో 120 గదులుండనుండగా, 1200 బెడ్స్ కు ఆక్సిజన్‌ సదుపాయం కల్పించనున్నారు. ఐసీయూకు 500 పడకలు, 32 మేజర్‌ మాడ్యులర్‌ ఆపరేషన్‌ థియేటర్లు, 6 మేజర్‌ మాడ్యులర్‌ ఎమర్జెన్సీ ఆపరేషన్‌ థియేటర్లు ఉంటాయని అధికారులు చెప్పారు.

రోగుల ఇబ్బందులు తీర్చేలా

ప్రస్తుతం నిమ్స్‌ ఆస్పత్రిలో 31 విభాగాలు ఉన్నాయి. కానీ ఒక్కో విభాగం ఒక్కో చోట ఉండటంతో రోగులు ఎటు వెళ్లాలో తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైద్యల వద్దకు వెళ్లడానికే గంటల సమయం పడుతుండగా.. వారి వద్ద నుంచి మరో వైద్యుడి వద్దకు వెళ్లాలంటే మరో బ్లాక్‌కు పరుగులు పెట్టాల్సి వస్తోంది. ఈ సమస్యను పరిష్కరించేలా అన్ని ఓపీ విభాగాలను కొత్త భవనంలోనే ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News