మూడో వారం నుంచి సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన

Update: 2023-08-13 08:37 GMT

అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో సీఎం కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా జిల్లాల పర్యటనలకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఈ నెల చివరి వారంలో రెండు జిల్లాల్లో పర్యటించనున్న ముఖ్యమంత్రి సెప్టెంబర్ నుంచి మరింత జోరు పెంచాలని నిర్ణయించారు. భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల చివరి వారంలో మెదక్, సూర్యాపేట జిల్లాల పర్యటనకు సంబంధించి రోడ్ మ్యాప్ ఖరారైంది. ఈ రెండు జిల్లాల్లో నిర్వహించే ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు పలు బహిరంగ సభల్లో సీఎం పాల్గొననున్నారు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకెళ్లడంతో పాటు విపక్షాలను ఎండగట్టేలా సీఎం కేసీఆర్ వ్యూహాలకు పదనుపెడుతున్నారు.

ఆగస్టు 19న మెదక్ జిల్లాలో ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ ఆఫీసుతో పాటు ఎస్పీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం నిర్వహించనున్న బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. అదే రోజున బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును ప్రారంభిస్తారు. ఈ క్రమంలో మెదక్ జిల్లా నాయకులు.. సభా నిర్వాహణ పనుల్లో నిమగ్నమయ్యారు.

ఆగస్టు 20న ముఖ్యమంత్రి కేసీఆర్ సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం, కొత్తగా నిర్మించిన ఎస్పీ ఆఫీసును ప్రారంభిస్తారు. జిల్లాలో కొత్తగా నిర్మించిన మెడికల్ కాలేజీని సైతం సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఆయన సూర్యాపేటలో కొత్తగా నిర్మించిన బీఆర్ఎస్ ఆఫీసు ఓపెనింగ్ చేస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.



Tags:    

Similar News