CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. రేషన్‌కార్డు ఉంటేనే ఉచిత విద్యుత్

Update: 2024-02-03 03:48 GMT

(CM Revanth Reddy)తెలంగాణలో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రణాళికలు వేస్తోంది. 6 గ్యారెంటీల్లో ఇప్పటికే 2 పథకాలను రేవంత్ రెడ్డి సర్కార్ అమలు చేసింది. మరో 2 గ్యారెంటీలను అమలు చేయడానికి కీలక ఆదేశాలు జారీచేసింది. సీఎం రేవంత్ రెడ్డి మరో 2 పథకాలను అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అందులో రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే ఉచిత విద్యుత్‌ను అందిస్తామని తెలిపారు. అర్హులకు లబ్ధి జరిగేలా గ్యారెంటీలను అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

200 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకానికి సంబంధించి సంబంధిత విభాగాల అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. ఆ గ్యారెంటీ అమలుకు ఎంత ఖర్చవుతుంది, ఎంత మందికి లబ్ధి చేకూరుతుందనే వివరాలను తెలుసుకున్నారు. బడ్జెట్‌లో అందుకు కేటాయించాల్సిన నిధుల గురించి చర్చించారు. తెల్లరేషన్ కార్డు కలిగిన వినియోగదారులు గత ఏడాది వినియోగించిన విద్యుత్ లెక్కలను పరిగణలోకి తీసుకుని 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తామని ఆయన నిన్న ఇంద్రవెల్లి సభలో ప్రకటించారు.

రేపు జరిగే కేబినెట్ సమావేశంలో ఉచిత విద్యుత్‌తో పాటుగా రూ.500 గ్యాస్ సిలిండర్ పథకాల అమలుపై మార్గదర్శకాలను రూపొందించనున్నారు. కేబినెట్ సమావేశంలో ఆ రెండు పథకాలను ఆమోదించనున్నారు. బడ్జెట్‌లో ఈ రెండు పథకాలకు అవసరమయ్యే నిధుల గురించి కూడా అంచనా వేస్తామన్నారు. ఇకపోతే 5 గ్యారెంటీలకు సంబంధించి మొత్తం 1,09,01,255 దరఖాస్తులు వచ్చాయని, అర్హులను గుర్తించి వారందరికీ మేలు జరిగేలా చూస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గ్యారెంటీల అమలుకు లేనిపోని నిబంధనలు పెట్టి ఎవరినీ ఇబ్బంది పెట్టొద్దని అధికారులకు సూచించారు.




 


Tags:    

Similar News