ధరణి స్థానంలో భూమాత పోర్టల్.. అధికారం చేపట్టిన వెంటనే అమలు

By :  Bharath
Update: 2023-11-18 02:44 GMT

ఎన్నికల్లో ప్రజలను ప్రలోభపెట్టేందుకు ప్రధాన పార్టీలన్నీ పోటాపోటీగా హామీలు, పథకాలు అమలు చేస్తున్నాయి. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ శుక్రవారం (నవంబర్ 17) మేనిఫెస్టోను ప్రకటించింది. అందులో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ను రద్దు చేసి.. మరింత మెరుగైన రెవెన్యూ సేవల కోసం భూమాత పేరుతో కొత్త పోర్టల్ ను తీసుకొస్తామని ప్రకటించింది. భూ హక్కులు కోల్పోయిన రైతులందరికీ న్యాయం జరిగేలా.. సమగ్ర భూ కమతాల సర్వే చేపట్టి, తిరిగి హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఆ సర్వే ఆధారంగా భూధార్ కార్డును అందిస్తామని తెలిపింది. అంతేకాకుండా అధికారంలోకి రాగానే ల్యాండ్ కమిషన్ ను ఏర్పాటుచేసి.. ప్రభుత్వం భూములకు రక్షణ కల్పిస్తామని ప్రకటించింది.

ప్రజల భూములను, భూమి హక్కులను కాపాడేందుకు సమగ్రమైన రెవెన్యూ ట్రిబ్యునల్​ను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఈ మేనిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా పేర్కొంది. గత కాంగ్రెస్ ప్రభుత్వం భూసంస్కరణల ద్వారా పేదలకు పంచిన 25 లక్షల ఎకరాల భూములపై పూర్తిస్థాయి హక్కులు కల్పిస్తామని స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఎవరి మధ్యనా భూమి కొట్లాటలు, వివాదాలు లేకుండా ఉండేలా పారదర్శకంగా ఆన్ లైన్ వ్యవస్థను ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చింది.

Tags:    

Similar News